శ్రీకాకుళం పాతబస్టాండ్: ఐఏఎస్ స్థాయి పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. సానా వీధిలోని మహాత్మా జ్యోతిరావుపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయానికి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా విచ్చేశారు. లైబ్రరీ, క్లాసు రూం, కంప్యూటర్ రూమ్లను సందర్శించారు. లైబ్రరీలో విద్యార్థులకు బోధిస్తున్న పుస్తకాలను పరిశీలించారు. పోలీసు కానిస్టేబుల్, బ్యాంకు ఉద్యోగాల స్థాయి పుస్తకాలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇప్పటి వరకు 36 మందికి బ్యాంకు పరీక్షలకు కోచింగ్ ఇవ్వగా, 11 మంది ప్రిలిమ్స్కు ఎంపికైనట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కె.ధనుంజయరావు తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలుకు సంబంధించి కోచింగ్ను ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తామని, 60 మందికి కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. బలగ ప్రాంతంలో రూ.1.50 కోట్లతో 2.8 ఎకరాల స్థలంలో బీసీ సంక్షేమ భవనం, హాస్టల్, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. లెబ్రరీని ఎం.కె.ఉదయలక్ష్మి నిర్వహిస్తున్నారని, నాగపుష్పలత ఏఓగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.