అక్రమార్కులకు అడ్డుకట్ట

22 Aug, 2016 20:35 IST|Sakshi
అక్రమార్కులకు అడ్డుకట్ట
* ముడి ఖనిజం పరిశీలన
* అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న 
అటవీ శాఖాధికారులు 
 
బొల్లాపల్లి : మండలంలోని బండ్లమోటు మైనింగ్‌ ప్రదేశాన్ని అటవీ శాఖ మాచర్ల ఏసీఎఫ్‌ పి.సునీత సోమవారం సందర్శించారు. బండ్లమోటు హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ నుంచి అక్రమార్కులు తరలించిన ముడి ఖనిజంను తిరిగి ఫారెస్ట్‌ శాఖాధికారులు స్వాధీనపరుచుకొని అటవీ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు చేరవేశారు. ఆ శాఖ ఆధీనంలో ఉన్న ముడి ఖనిజాన్ని ఆమె పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం బండ్లమోటు నర్సరీ వద్ద ఈ విషయంపై అదే పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్‌ ఎస్‌కే హబీబ్‌బాషా, మరి కొందరు యువకులు కలిసి మైనింగ్‌కు సంబంధించి ముడి ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తుండగా అడ్డగించి పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించినా ఎలాంటి చర్యలు లేవని ఏసీఎఫ్‌ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక అధికారులు ముడి ఖనిజం తరలించే యంత్రాలను వదలివేశారని, దీని ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేసు నమోదు చేశామని సమస్యను దాటవేస్తున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తరలించిన ముడి ఖనిజంలో 30 టన్నులు తేడా ఉందని కూడా గనులు, భూగర్భ శాఖ అధికారులు నిర్థారించారని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరారు. దీనిపై ఏసీఎఫ్‌ సునీత మాట్లాడుతూ గనులు, భూగర్భ శాఖ అధికారుల నుంచి ముడి ఖనిజం వివరాలు రావాల్సి ఉందని, సమాచారం రాగానే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అక్రమార్కులను ఉపేక్షేంచిలేదని చెప్పారు. ఆమె వెంట వినుకొండ ఫారెస్ట్‌ రేంజర్‌ ఎస్‌. హరి, ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
 
 
మరిన్ని వార్తలు