జగదేవ్పూర్:సీఎం కేసీఆర్ దత్తత గ్రామలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో వివిధ పంటలు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు విస్తారంగా సాగవుతున్నాయి. రెండు గ్రామాల్లో సమష్టి వ్యవసాయంలో భాగంగా ఎర్రనేలల్లో మొక్కజొన్న, నల్ల భూముల్లో సోయాబీన్ పంటలను సాగు చేశారు. 2,800 ఎకరాలను 14 జోన్లుగా విభజించి ఒక్క జోన్ పరిధిలో 200 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీన్ విత్తనాలను ట్రాక్టర్ల ద్వారా విత్తారు. ప్రస్తుతం మొలకలెత్తిన పంటలతో రెండు గ్రామాలు కళకళలాడుతున్నాయి. రైతులు తమ భూముల్లో దంతె, గొర్రు, గడ్డి తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎటు చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి.