పద్ధతి మార్చుకోలేదని ప్రాణం తీశాడు

29 Aug, 2017 23:07 IST|Sakshi
పద్ధతి మార్చుకోలేదని ప్రాణం తీశాడు

- ప్రియురాలిని చంపిన ప్రియుడు
- శవం సహా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు


తనకల్లు: వివాహేతర సంబంధం వద్దని చెప్పినా పద్ధతి మార్చుకోనందుకు ప్రియురాలిని అంతమొందించిన ప్రియుడి ఉదంతం తనకల్లు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. శవం సహా పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణానికి చెందిన అశోక్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్‌ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్థానిక ఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న కుమార్‌ బ్రిక్స్, టైల్స్‌ వర్క్‌ చేసేవాడు. కుమార్‌ అప్పుడుప్పుడు సిమెంట్‌ ఇటుకలు, టైల్స్‌ని అశోక్‌కు చెందిన టాటా ఏస్‌ వాహనంలో తరలించేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈ నేపధ్యంలో కుమార్‌ ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్తూ అతని భార్య మల్లీశ్వరి(40)తో ఏడాది నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు.

విషయం తెలుసుకున్న కుమార్‌.. అశోక్‌తో గొడవపెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత అశోక్‌ తిరుపతికి వెళ్లి కారును బాడుగుల కోసం పెట్టుకొని అక్కడే ఉంటున్నాడు. అయినా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం అలాగే కొనసాగేది. మంగళవారం మల్లీశ్వరిని కొక్కంటిక్రాస్‌కు రప్పించుకున్నాడు. అక్కడి నుంచి తన కారు(ఏపీ 03 టీవీ 5788)లో ఆమెను కూర్చోబెట్టుకొని పెట్రోల్‌ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఆపి కారులోనే గొడవపెట్టుకున్నాడు. ‘నువ్వు నాతోనే కాదు.. ఇంకా ఆరుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. వెంటనే వాటన్నింటినీ వదులుకో’ అని అశోక్‌ హుకుం జారీ చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అశోక్‌ కారులో ఉంచిన కొడవలితో మల్లీశ్వరి మెడపై ఐదుసార్లు నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం శవాన్ని కారులోనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఆమెని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్యనారాయణ తెలిపారు.

మరిన్ని వార్తలు