అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

22 Feb, 2017 00:15 IST|Sakshi
కర్నూలు: కర్నూలు మండలం పుల్లూరు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల, చేతులను కుక్కలు పీక్కు తినడంతో మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉంది. గ్రామ శివారులోని కోళ్ల బావాపురానికి వెళ్లే రోడ్డులో మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తాలుకా ఎస్‌ఐ గిరిబాబు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మృతదేహానికి పురుగులు పట్టి ఉండటంతో సుమారు నాలుగు రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో గ్రామంలో విచారించారు. సుమారు 5.4 అడుగుల ఎత్తు, తెలుపు రంగులో ఉన్న మృతుడు నల్లని ప్యాంటు, నల్లని గీతలు గల తెల్లని ఫుల్‌షర్టు, నల్లని చెప్పులు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 87901 86148 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని తాలుకా ఎస్‌ఐ గిరిబాబు విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు