కూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది

28 Jan, 2017 10:15 IST|Sakshi
కూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది

ఫరూఖ్‌నగర్‌(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. రొట్టెల పిండి పడేసిందని కన్నకూతురిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో తల్లి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం చింతగూడెంలో శనివారం వెలుగుచూసింది.

గ్రామానికి చెందిన దొబ్బ చెన్నయ్య, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి రొట్టెల పిండి తీసుకురమ్మని చిన్న కూతరు రాధికను తల్లి దుకాణానికి పంపింది. ఈ క్రమంలో రొట్టెల పిండి తీసుకొని వస్తూ..రాధిక అదుపుతప్పి కిందపడింది. దీంతో పిండి నేలపాలైంది. ఆగ్రహానికి గురైన స్వరూప రాధికను తీవ్రంగా కొట్టడంతో పాటు, చిన్నారిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను 108 సాయంతో షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.