పెట్టు‘బడి’కష్టమే..!

26 Jul, 2016 22:53 IST|Sakshi
పెట్టు‘బడి’కష్టమే..!
ఉపా«ధ్యాయుల అవస్థలు 
పంపిణీకి నోచుకోని పాఠశాల, నిర్వహణ నిధులు
విద్యా కమిటీల కోసం నిలిపివేత
సుద్దముక్కలు కూడా కరువే..
పిఠాపురం :
విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలల నిర్వహణకు గతేడాది ఒక్కరూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వం.. ఆ నిధులను ఈ ఏడాది విడుదల చేసినట్లు చెబుతున్నా పంపిణీ మాత్రం జరగలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాఠశాలల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. రాష్రీ్ట్రయ మాథ్యమికశిక్షాభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ)కు సంబంధించిన పాఠశాలల నిర్వహణ ఖర్చులు విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఉపాధ్యాయులు గగ్గోలుపెడుతున్నారు. బోధనోపకరణాల కోసం ఉపాధ్యాయులకు ఇచ్చే టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ (టీఎల్‌ఎం) నిధులు సైతం విడుదల కాకపోవడంతో ప్రాథమిక పాఠశాలల్లోనూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.  
జిల్లాలో పాఠశాలలు
జిల్లాలో 4,412 పాఠశాలలు ఉండగా ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి  ఒక్కొ ఉపాధ్యాయుడికి రూ.500 చొప్పున విడుదల కావాల్సి ఉంది. ఆ సొమ్ముతో సుద్దముక్కలు, ఇతర అవసరాలను తీర్చుకుంటారు. కానీ రెండేళ్లుగా ఈ నిధులు ఇవ్వడం లేదు. వీటితో పాటు పాఠశాలల నిర్వహణ ఖర్చుల కింద అదనపు వనరులు సమకూర్చుకోవడానికి ఒక్కొక్క పాఠశాలకు రూ.5 వేలు విడుదల కావాల్సి ఉంది. మూడు గదులున్న పాఠశాలలకు రూ.5 వేలు, అంతకంటే ఎక్కు వ ఉన్న పాఠశాలలకు రూ.10 వేలు కేటాయించారు. కానీ ఆ నిధులు విడుదల కాలేదు.
నిధుల వినియోగం ఇలా..
ఉన్నత పాఠశాలలకు సంబంధించి గతంలో ఒక్కొక్క పాఠశాలకు రూ.12 వేలు ఉండగా, వాటిని రూ.34 వేలకు పెంచారు. వీటిలో రూ.17 వేలును ఆయా పాఠశాలల తరగతి గదుల మరమ్మతులకు, రూ.12 వేలు సైన్స్‌ పరికరాలు, ల్యాబ్‌ నిర్వహణకు వినియోగించాలి. రూ.1000 అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు, రూ.2 వేలు ఆయా పాఠశాలల విద్యుత్‌ బిల్లులకు వినియోగించుకునేందుకు నిర్ణయించారు. ఏటా జూన్‌ నుంచి ఏప్రిల్‌ వరకు ఉన్న విద్యా సంవత్సరంలో జూన్‌ నెలలోనే పాఠశాల ప్రారంభ దశలోనే ఈ నిధులు విడుదల కావల్సి ఉంది. గత 2015–16 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 4412 పాఠశాలలకు రూ.17 వేల చొప్పున నిర్వహణ ఖర్చులకు మాత్రమే (మరో రూ 17 వేలు భవనాల మరమ్మతులకు నిధులు విడుదల కాలేదు)  రూ 7.50 కోట్లు ఈ ఏడాది మంజూరైంది. కానీ ఆ నిధులు ఆయా ఉపాధ్యాయుల ఖాతాల్లో వేయలేదు.  2016–17కు సంబంధించి స్కూలు గ్రాంటు, స్కూలు మేనేజ్‌మెంటు గ్రాంటు, పాఠశాల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులకు రూ.200 కోట్లకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గత ఏడాది నిధులే ఇప్పటి ఇవ్వక పోగా ఈ ఏడాది నిధులు ఎప్పుడు వస్తాయో అసలు ఇస్తారో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
కొత్త  విద్యాకమిటీల కోసమేనా!
ఈ నిధులన్ని ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల బ్యాంకుఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త కమిటీలు వచ్చిన వెంటనే ఆ నిధులు వారి జాయింట్‌ ఎక్కౌంటు ద్వారా వేయడానికి తద్వారా ఆనిధుల వినియోగంపై కమిటీలకు పెత్తనం కట్టబెట్టడానికి ప్రభుత్వం నిధుల పంపిణీని నిలిపివేసినట్లు సమాచారం. గత ఏడాది పాఠశాల నిర్వహణకు పెట్టుబడి తాము పెడితే నిధులు విద్యాకమిటీల ద్వారా ఇవ్వడమేమిటని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
 
టీచర్ల జేబులకు చిల్లులు
ఈ ఏడాది ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పలు పాఠశాలల్లో సుద్ద ముక్కలుకూడా కరువయ్యాయి. ఉపాధ్యాయులే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం కాగితం కావాలన్నా వారి జేబుల్లోంచి డబ్బులు తీయాల్సి వస్తోంది. పలు పాఠశాలల్లో బిల్లులు చెల్లించక విద్యుత్‌ కనెక్షన్లు కట్‌ అవుతున్నాయి. సైన్స్‌ ల్యా»Œ ల్లో పరికరాలు లేక  ప్రయోగాలు చేసే అవకాశం లేకుండా పోతోంది. దీనిపై సర్వశిక్షా అభియాన్‌ పీఓ టీవీజే కుమార్‌ను వివరణ కోరగా త్వరలోనే నిధుల పంపిణీకి చర్యలు
తీసుకుంటున్నామన్నారు.
మరిన్ని వార్తలు