66 వేలకే సొంతిల్లు!

9 Nov, 2015 00:22 IST|Sakshi
66 వేలకే సొంతిల్లు!

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు. సామాన్య మధ్యత రగతి కుటుంబాలకు ఆర్థికంగా అత్యంత భారమైన పనులివి. సాంకేతిక అభివృద్ధి చాలా రకాల సేవలను తక్కువ ధరకు, ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నా, ఇంటి నిర్మాణంలో సౌకర్యాల అభివృద్ధి జరుగుతోంది కానీ ఖర్చు విషయంలో మాత్రం తగ్గుదల లేదింత వరకూ. సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము.. ఇలా ప్రతీదీ ఖరీదే. ఇలాంటి పరిస్థితుల మధ్య వియత్నాం పరిశోధకులు సరికొత్త గృహ నమూనాను ఆవిష్కరించారు. నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ‘ఎస్ హౌస్’ నిర్మాణానికి సంబంధించి తాజాగా నమూనాను ప్రదర్శించారు. కేవలం వెయ్యి డాలర్ల (భారత ద్ర వ్యమానంలో దాదాపు రూ.66 వేలు) ఖర్చుతో పూర్తి నిర్మాణం పూర్తయ్యే ఈ ఇంటి విశే షాలు ఆసక్తికరంగా ఉన్నాయి.     - సాక్షి సెంట్రల్‌డెస్క్
 
 ప్రస్తుతం ఈ ఇల్లు ప్రీ మార్కెట్ దశలో ఉంది. త్వరలోనే భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం.. ఆ తర్వాత అమ్మకానికి పెట్టడం అంతే! ఇల్లేమిటి ఉత్పత్తి చేయడం ఏమిటి? అంటే... ఈ ఇంటి విషయంలో అంతే. కాంక్రీట్ ఫౌండేషన్, వుడెన్ ఫ్లోర్, స్టీల్ ఫ్రేమ్, స్టీల్ షీట్ రూఫ్, ఒక స్టీల్ డ్రైనేజ్‌గటర్... వీటిని వేరువేరుగా తయారు చేస్తారు. అన్నింటినీ కలిపి ఒక చోట అమర్చుకుంటే చాలు ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది.
 
 మూడు గంటల్లో నిర్మాణం.. 30 ఏళ్ల జీవితం...
 పై సరంజామాతో ‘ఎస్ హౌస్’ను అమర్చడానికి మూడు గంటల సమయం పడుతుందని రూపకర్తలు చెబుతున్నారు. కనీసం ముప్పై సంవత్సరాల పాటు ఈ ఇంటిలో దర్జాగా నివ సించవచ్చని హామీ ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇల్లు చెక్కుచెదరదని అంటున్నారు.
 
 340 చదరపు అడుగుల ఇల్లు
 ఫార్ములా ప్రకారం వెయ్యి డాలర్ల వ్యయం తో 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. అదనంగా వెచ్చించి ఇంతకంటే విశాలంగా కావాలన్నా నిర్మించుకోవచ్చు, ఒకటికి మించిన స్థాయిలో ఇళ్లను జాయింట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
 
 సిమెంట్, ఇసుక అవసరం లేదు
 ఈ ఫార్ములాలో పేర్కొన్న సరంజామా తప్ప నిర్మాణంలో అదనంగా ఎలాంటి అవసరాలూ ఉండ వు. అక్రమ రవాణా పాలవుతూ ధర విషయంలో కొండెక్కిన ఇసుక కానీ, సిమెంట్ కానీ, ప్రత్యేకంగా ఇనుము కానీ కొనాల్సిన అవసరం ఉండదు.
 
 తుప్పుపట్టదు, చెదలు దరిచేరవు
 ఈ నిర్మాణంలో ఉపయోగించే వుడ్‌కు, స్టీల్‌కు చెద, తుప్పు భయాలుండవని రూపకర్తలు హామీ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలు గడిచినా కూడా అవి చెక్కుచెదరవని చెబుతున్నారు.
 
 ప్రకృతి వైపరీత్యాలనూ ఎదుర్కొనగలదు..
 రాళ్లతో కట్టిన పునాదులేమీ లేకపోయినా, భారీగా ఖర్చు పెట్టకపోయినా... టైపూన్లు, హరికేన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలబడే స్థాయిలో ఈ నిర్మాణం ఉంటుంది.
 
 ప్రస్తుతానికి వియత్నాంలో..
 అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘ఎస్ హౌస్’ ప్రణాళికను ప్రారంభించారు. ఇప్పుడు ఇది ప్రొటోటైప్ దశ వరకూ వచ్చింది. అతి త్వరలోనే వియత్నాంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని దేశాల్లోని పేదలందరికీ ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి వనరులను సమకూర్చే లక్ష్యం ఉంది రూపకర్తలకు. మరి వారి లక్ష్యం సిద్ధించి... మనదేశంలోని గుడిసెలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు