నగరంలో ఊపందుకున్న లడ్డూ వేలం!

11 Sep, 2016 23:24 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణేశ్‌ నిమజ్జనాల సందడి పెరిగింది. మరోవైపు నిమజ్జనానికి ముందు నిర్వహించే గణపతి లడ్డూల వేలం పాటలు సైతం ఊపందుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన లడ్డూలు వేలం వేయడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయమే. కాగా కొందరు లడ్డూల వేలంతోపాటు లడ్డూలు ఎవరు ఎక్కువగా తింటారనే పోటీలు సైతం నిర్వహిస్తున్నారు.

ఈ పోటీలు ప్రమాదకరమని, ఒక్కోసారి ప్రాణాలమీదికి తెస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  గతంలో సరదా కోసం ఓ ఎఫ్‌ఎం రేడియో సంస్థ ఏర్పాటు చేసిన ‘లడ్డూ్డలు తినే పోటీ’ తార్నాకలో జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తుచేస్తున్నారు. వేలం పాటలు ఓకే అయినా...తినే పోటీకి దూరంగా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.                                             

గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్‌ సంస్థలూ ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వివిధ ఆకృతులతో ఉన్న టోపీలు, టీ–షర్టులు పంచి పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా... లడ్డూలు తినే పోటీలు వంటివీ నిర్వహిస్తారు.

పోటీలో పాల్గొని అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణేలు, నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తుంటారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గొంతులో ఇరుక్కుంటే ప్రాణాంతకమే...
ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడంతో పాటు ఏమాత్రం విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో  లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా...

ఇరుక్కున్న వాటిని తొలగించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్ళు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ట్రాకియా దెబ్బతినడం వల్లే...
లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. కంఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రాకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారానే మనిషి శ్వాస తీసుకుంటాడు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది.

ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమారుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. లడ్డూ పోటీల నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. ఫలితంగా ఆ ఆహారపదార్థాలు ట్రాకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి కన్ను మూస్తుంటాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్‌ నెర్వ్‌పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్‌ అనేది ఏర్పడుతుందని ఫలితాగానూ గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు.

ఓ కన్నేసి ఉంచండి: పోలీసులు
నగరంలో గణేష్‌ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు భక్తుల్ని ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే ‘శుభం’ అనే సెంటిమెంట్‌ సైతం కొందరికి ఉంటుందని సూచిస్తున్నారు.

గత ఏడాది ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరారని పేర్కొంటున్నారు. అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండపాల నిర్వాహకులు రాత్రి వేళల్లో తమ ప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు.

కుక్కల కట్టడిలో పోలీసులు...
బోనాలు, గణేష్‌ వంటి పండుగలు వస్తున్నాయంటే పోలీసులు రౌడీషీటర్లు, అసాంఘికశక్తులతో పాటు అనుమానితుల విషయంలో అప్రమత్తంగా ఉండటం తెలిసిందే. అయితే మంగళవారం బక్రీద్‌ పండుగ కూడా కావడంతో ‘గ్రేటర్‌’లోని మూడు కమిషనరేట్ల పోలీసులు వీరితో పాటు గ్రామ సింహాల (శునకాలు) పైనా కన్నేసి ఉంచాలని నిర్ణయించారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై పడే జంతు వ్యర్థాలను కుక్కలు తింటూ ఉంటాయి. కొన్ని శునకాలు వాటిని లాక్కువెళ్ళి కొంత భాగం తిని, మిగిలింది వదిలేస్తుంటాయి. ఈ నేపథ్యంలో కుక్కల్ని కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీనికోసం జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర వర్గాల సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించారు.

 

మరిన్ని వార్తలు