'హీరో శివాజీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం'

30 Apr, 2016 14:37 IST|Sakshi
'హీరో శివాజీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం'

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డి శనివారం స్పష్టం చేశారు. దేశం నుంచి ఏపీని విడదీయాలంటూ సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజద్రోహం చేసే విధంగా శివాజీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అతడిపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీపై హీరో శివాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకీ ప్రత్యేక హోదా అవసరం లేదంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి హెచ్ బీ చౌదరి నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కార్పొరేట్ పైరవీల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా మోదీ ప్రత్యేక హోదాపై పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రతి విషయంలోనూ అన్యాయం జరుగుతోందని శివాజీ అన్నారు.
 

మరిన్ని వార్తలు