కొనసాగిన గాలింపు

27 Jul, 2016 23:13 IST|Sakshi
కొనసాగిన గాలింపు
లభించని ఎయిర్‌ఫోర్స్‌   విమానం ఆచూకీ
మూడో రోజూ వాయుసేన, నేవీ అధికారుల ఆరా
లోదొడ్డి (రాజవొమ్మంగి) : గగన తలంపై ఎగురుతూ రాడార్‌ వ్యవస్థకు అందకుండా శుక్రవారం గల్లంతైన భారత వాయుసేన(ఇండియన్‌ ఎయిర్‌ఫోర్‌్స)కు చెందిన ఏఎన్‌32 విమానం కోసం తూర్పు మన్యం రాజవొమ్మంగి, పరిసర ప్రాంతాల్లో మూడో రోజైన బుధవారం కూడా విస్తృత గాలింపు కొనసాగింది. ఆకాశమార్గాన హెలీకాప్టర్లు లోతట్టు ప్రాంతాలైన లోదొడ్డి, ఇతర గ్రామాల సమీపాన అడవుల మీదుగా చక్కర్లు కొట్టినట్లు గిరిజనులు విలేకరులకు తెలిపారు. మూడు రోజులుగా తమను నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ఆ విమానం ఆచూకీ కోసం సంప్రదిస్తూనే ఉన్నారని, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తూ సమాచారం కోరుతున్నారని స్థానిక సీఐ కేఎన్‌ మోహ¯Œæరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. జడ్డంగి ఎస్సై వెంకటనాగార్జున, ఇతర సిబ్బందిని లోదొడ్డితో పాటు పరిసర ప్రాంతాలకు పంపించి వాకబు చేయగా, ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొన్నారు. గడచిన శుక్రవారం ఓ పెద్ద విమానం చెట్లకు తాకేలా వెళుతూ కనిపించిందని గిరిజనులు చెబుతున్నారని, అది ఎంత వాస్తవమో తెలియదని చెప్పారు.
ఎయిర్‌ఫోర్స్, నేవీ ఆరా
విమానం కోసం గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులు ఏలేశ్వరం, జడ్డంగి, రాజవొమ్మంగి పోలీసులు, రాజవొమ్మంగి, ఏలేశ్వరం, కాకినాడ అటవీఅధికారుల సాయంతో లోదొడ్డి పరిసరాల్లో ఉన్న ఎల్తైన పర్వత పంక్తుల్లో విమానం కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు తూర్పు గోదావరి, విశాఖ సరిహద్దు రక్షిత అటవీ ప్రాంతంలోని సరుగుడు అనే ప్రదేశానికి చెందిన భౌగోళిక సమాచారాన్ని ఆయా అధికారులకు అందజేసినట్టు స్థానిక అటవీ క్షేత్రాధికారి మానాప్రగడ శివకుమార్‌ తెలిపారు. దాని ఆధారంగా రక్షిత అటవీ ప్రాంతంలో గాలింపు జరుగుతోందని, పూర్తి వివరాలను ఆ అధికారులు వెల్లడించలేదన్నారు.
ఎల్తైన పర్వతపంక్తులు, దట్టమైన అడవులు
అదృశ్యమైన విమానం కోసం గాలిస్తున్న ప్రాంతం తూర్పు, విశాఖ జిల్లాల సరిహద్దులోని ఎత్తయిన పర్వత శ్రేణులు, దట్టమైన అడవులు ఉన్న ప్రాంతం. దీనిని నాగులకొండ పర్వత పంక్తి అంటారు. ఈ ప్రాంతంలో ఏదైనా విమానం గల్లంతైతే, ఆచూకీ లభించడం అంత సులువుకాదని గిరిజనులు చెబుతున్నారు. భారీ లోయలు ఉండే ఈ ప్రాంతానికి కాలినడకన వెళ్లాలంటే చాలా ప్రయాసతో కూడిన విషయమన్నారు. ఆకాశమార్గాన గాలించినా, చెట్లు అడ్డువచ్చి, ఏమీ కనిపించదని పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు