ఎర్రజెండాలకు కాలం చెల్లింది

22 Jun, 2016 03:19 IST|Sakshi

* కార్మికులు టీఎంయూకు మద్దతు తెలపాలి
* సంఘం రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి

మహబూబ్‌నగర్ క్రైం : ప్రస్తుతం ఎర్రజెండాలకు కాలం చెల్లిందని, భవిష్యత్‌లో ఆర్టీసీ గులాబీమయం అవుతుందని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. వచ్చే నెలలో గుర్తింపు సంఘాల ఎన్నికల్లో భాగంగా మంగళవారం మహబూబ్‌నగర్ బస్టాండులో ఆయన ప్రచారం చేశారు. తమ సంఘానికి  సంపూర్ణ మద్దతు తెలపాలని కార్మికులను కోరారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల పక్షాన పోరాటం చేసి 44శాతం ఫిట్‌మెంట్ సాధించామన్నారు. ఇటీవల కాలంలో 4,300మంది సిబ్బంది సర్వీసును క్రమబద్ధీకరించారని, కారుణ్య నియామకాలకు కృషి చేశామన్నారు. కార్మికులకు రూ.ఆరు కోట్ల ఆర్‌బీసీ, అలవెన్స్ వచ్చేలా పోరాటం చేశామన్నారు. ఈ ఎన్నికల్లో గుర్తులతో సంబంధం లేకుండా వ్యక్తులను చూసి ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర నాయకులు రాజసింహుడు, జి.ఎల్.గౌడ్, డి.ఎస్.చారి, బి.వి.రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు