జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండిపెడుతున్న వంట కార్మికుల గోడు పట్టదా అని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అన్నారు. ఆ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తెలంగాణచౌరస్తాలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిచలేక పోతున్నారని అన్నారు. ధరలకు అనుగుణంగా మెస్చార్జీలు పెంచాలని కోరారు. వారంలో 3గుడ్లు పెట్టాలని ప్రభుత్వం చెబుతున్నా ప్రభుత్వం చెల్లించే బిల్లులకు ఒక్క గుడ్డు కూడా రావడం లేదన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు వేధింపులు ఆపాలని కోరారు. కార్యక్రమంలో గీతాబాయ్, సురేష్, గోవిందమ్మ, శేషన్న, ఆశమ్మ, కురుమూర్తి, దేవమ్మ, సోమేశ్వరమ్మ, బాషా, నీలకంఠం, నాగమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.