రైస్‌ మిల్లర్లకు వేబిల్లుల నిలిపివేత

17 Aug, 2016 01:45 IST|Sakshi
  • నిర్ధేశించిన సమయంలో సీఎంఆర్‌ ఇవ్వాలి
  • ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ
  •  
    నెల్లూరు(పొగతోట): కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) సరఫరా చేయకుండా కాకమ్మ కబుర్లు చెబితే సహించేది లేదని జేసీ ఇంతియాజ్‌ అహ్మద్‌ రైస్‌ మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో సీఎస్‌డీటీలు, డీటీలు, రైస్‌ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. సీఎంఆర్‌ సరఫరా చేయడానికి సమయం కావాలని ఈ సందర్భంగా మిల్లర్లు జేసీని కోరారు. ధాన్యం బస్తాలు మిల్లుల్లో నిల్వ ఉంచితే కోతులు గందరగోళం చేస్తున్నాయని మిల్లర్లు చెప్పడంతో కుంటిసాకులు చెప్పడం మానుకుని సీఎంఆర్‌ సరఫరా చేయాలని జేసీ సూచించారు. సీఎంఆర్‌ పూర్తి స్థాయిలో సరఫరా చేసేంత వరకు రైస్‌ మిల్లులకు వేబిల్లులు కట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్‌ 10 నాటికి 90 శాతం, 15న నాటికి 100 శాతం సీఎంఆర్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్లు వారికి కేటాయించిన రైస్‌ మిల్లుల్లో నిత్యం పర్యవేక్షిస్తూ ధాన్యం ఆడించి సీఎంఆర్‌ గోదాములకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీఎంఆర్‌ సరఫరా చేయని రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్‌ఓ టి.ధర్మారెడ్డి, డీఎం కొండయ్య సీఎస్‌డీటీలు, డీటీలు, రైస్‌ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు