సబ్‌ పోస్టాఫీస్‌లో డిపాజిట్‌ సొమ్ము స్వాహా!

31 Aug, 2016 00:16 IST|Sakshi
జిన్నూరు (పోడూరు): జిన్నూరు సబ్‌పోస్టాఫీసులో పలువురు ఖాతాదారులు డిపాజిట్‌ చేసిన సొమ్ము నెలలు గడిచినా ఆన్‌లైన్‌ కాని వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగి కొంత సొమ్మును ఆన్‌లైన్‌ చేయకుండా స్వాహా చేసినట్టు పలువురు ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్‌ చేసిన సొమ్మును ఖాతాదారుల పాస్‌బుక్‌లో నమోదు చేసినా కంప్యూటర్‌లో ‘ఆన్‌లైన్‌’ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విషయం పోస్టల్‌ అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఖాతాదారులను కార్యాలయానికి రప్పించి పాస్‌పుస్తకాలు తనిఖీ చేస్తున్నారు. దీనిపై పాత్రికేయులు పోస్టాఫీసుకు వెళ్లి ఉద్యోగులను వివరణ అడగ్గా ఎటువంటి అవకతవకలు జరగలేదనీ, దీనిపై తాము మాట్లాడకూడదని  చెప్పారు. పోస్టాఫీసులో పెద్దమొత్తంలో సొమ్ము స్వాహా జరిగిందని గ్రామస్తుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురు ఖాతాదారులు తాము డిపాజిట్‌ చేసిన సొమ్ము గురించి ఆందోళనలో ఉన్నారు. పోస్టల్‌ అధికారులు స్పందించి ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
మరిన్ని వార్తలు