ఓబుళదేవరచెరువు (పుట్టపర్తి) : జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం వేర్వేరు ప్రాంతాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. ఓబుళదేవరచెరువు మండలం నల్లగుట్లపల్లికి చెందిన వేమనారాయణ(55) అనే గొర్రెల కాపరి వడదెబ్బకు గురై మరణించాడినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం పగలంతా మేత కోసం జీవాలను అటవీ ప్రాంతానికి తోలుకెళ్లిన అతను రాత్రి ఇంటికొచ్చాడు. భోజనం చేసిన కాసేపటికే సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే 108లో కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి భార్య లక్ష్మీనరసమ్మ, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
గుత్తిలో మరొకరు..
గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో గల బ్రిడ్జి వద్ద నివాసముంటున్న రాముడు(55) కూడా వడదెబ్బకు గురై శనివారం మరణించినట్లు బంధువులు తెలిపారు. సొంత పని మీద శుక్రవారం పగలంతా ఎండలో తిరిగొచ్చిన అతను సాయంత్రం ఇంటికి రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ వెంటనే వాంతులు, వీరేచనాలయ్యాయన్నారు. దీంతో అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికొచ్చిన అతను శనివారం ఉదయమే మృతి చెందాడని చెప్పారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.