వ్యక్తిపై హత్యాయత్నం

22 Jan, 2017 10:09 IST|Sakshi
వ్యక్తిపై హత్యాయత్నం

వేంపల్లె: వేంపల్లె పట్టణ పరిధిలోని చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మారం ఆంజనేయరెడ్డిపై శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆంజనేయరెడ్డికి తలపైన, ఎడమ కాలుపై తీవ్ర గాయాలయ్యాయి. వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. బాధితుడి కథనం మేరకు.. మారం ఆంజనేయరెడ్డి ప్రతి శనివారం తెల్లవారుజామున గండి వీరాంజనేయస్వామిని దర్శించుకొనేందుకు వెళుతుంటారు. అయితే ఈ శనివారం తెల్లవారుజామున కూడా చింతలమడుగుపల్లె నుంచి మోటారు బైకుపై గండికి బయలుదేరారు. కుమ్మరాంపల్లె గ్రామం వద్ద నుంచి రెండు మోటారు బైకులలో కొందరు వ్యక్తులు కర్రలు తీసుకొని వెంబడిస్తూ వచ్చారు. వీరన్నగట్టుపల్లె బ్రిడ్జి వద్ద మోటారు బైకుపై వెనకవైపు నుంచి వస్తున్న వ్యక్తులు ఆంజనేయరెడ్డి తలపై కర్రలతో దాడి చేయగా అదుపు తప్పి కిందపడ్డాడు. గాయపడిన ఆంజనేయరెడ్డి మోటారు బైకును మళ్లీ తీసుకొని వీరన్నగట్టుపల్లె సర్కిల్‌కు చేరుకున్నారు. మళ్లీ దాడి చేసిన వ్యక్తులు అక్కడికి రావాలని ప్రయత్నించినా.. అప్పటికే స్థానికులు అక్కడ ఉండటంతో వెనుతిరిగారు. ఈ విషయాన్ని బాధితుడు తన స్నేహితుడు మల్లికి ఫోన్‌ చేసి తెలియజేయడంతో 108 వాహనానికి సమాచారం పంపి వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి ఆంజనేయరెడ్డిని తరలించారు. తనకు ఎవరూ శత్రువులు  లేరని.. తనపై దాడి ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తనకు తెలియడంలేదని బాధితుడు ఆంజనేయరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ మస్తాన్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు