ఇద్దరు యువకుల దుర్మరణం

30 May, 2017 23:36 IST|Sakshi
ఇద్దరు యువకుల దుర్మరణం

- లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
- మాంసపు ముద్దలా మృతదేహాలు

నల్లమాడ : ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్‌ఐ కె.గోపి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పులగంపల్లి సమీపాన కదిరి–హిందూపురం రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటాగుళ్ల తారకరామనగర్‌కు చెందిన మూడే మహేష్‌నాయక్‌(24), నల్లచెరువు మండలం బాలేపల్లికి తండాకు చెందిన భూక్యా రమేష్‌నాయక్‌(24) అక్కడికక్కడే మృతి చెందారు.

ఆటో కంతు చెల్లించేందుకు వెళ్లి..
సమీప బంధువులైన వీరు హిందూపురంలో ఆటో కంతు (ప్రీమియం) చెల్లించి ద్విచక్ర వాహనంలో కదిరికి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో పులగంపల్లికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రోడ్డు మలుపులో కదిరి వైపు నుంచి ఎదురుగా వస్తున్న సిమెంట్‌ లారీని బలంగా ఢీకొట్టారు. లారీ కుడివైపు, ద్విచక్ర వాహనం ముందు వైపు నుజ్జునుజ్జు అయ్యాయి. ద్విచక్ర వాహనం లారీ కింద ఇరుక్కుపోవడంతో.. మహేష్‌నాయక్, రమేష్‌నాయక్‌ మీదుగా లారీ కుడివైపు ముందు చక్రం దూసుకెళ్లింది. దీంతో మహేష్‌నాయక్‌ తల ఛిద్రమయింది.

రమేష్‌నాయక్‌ ఎడమకాలు తొడవద్దకు విరిగిపోయి మృతదేహాలు మాంసం ముద్దల్లా తయారయ్యాయి. సమాచారం అందిన వెంటనే నల్లమాడ, అమడగూరు ఎస్‌ఐలు కె.గోపీ, చలపతి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాకీ సాయంతో లారీని పైకి లేపి మృతదేహాలను, ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. కదిరి పట్టణ సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులిద్దరికీ భార్య, కూతరు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.

మరిన్ని వార్తలు