ఉద్యోగ ఉరి

12 Mar, 2016 03:59 IST|Sakshi
ఉద్యోగ ఉరి

అసెంబ్లీ సాక్షిగా ఇన్ని అబద్ధాలా...!
నిరుగ్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు తప్పించుకోవడమా
అసలు ఆ పథకమే లేదనడం సిగ్గుమాలిన వ్యవహారం
బాబు వచ్చినా జాబు రాలేదు ... నిరుద్యోగ భృతి ఊసేలేదు...

మరోసారి బాబు దగా
‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి ... ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదువుకోకపోయినా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి... తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’ 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన   ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడు  ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో  ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వకపోయినా నెలకు రూ.2 వేలు భృతైనా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు  ఎన్నికల హామీలు నమ్మిన జిల్లాలోని  సుమారు 72 వేల నిరుద్యోగులు అధికారికంగా ఉపాధికల్పన కార్యాల యంలో ఇప్పటి వరకూ నమోదు చేసుకుని మోసపోయామని ఆవేదన చెందుతున్నారు.

 వైఎస్సార్ సీపీ గళంతో బయటపడిన బండారం
నిండు శాసన సభ ... వైఎస్సార్ సీపీ జగన్మోహన్ రెడ్డి అనర్గళ ప్రసంగం ... రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రశ్నల పరంపర ... ‘నేను అధికారంలోకి వస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయి... మీ కలల కు భరోసా నేనంటూ’ చంద్రబాబు ఇచ్చిన దగాకోరు హామీని గుర్తు చేస్తున్న వేళ... పచ్చి అబద్ధపు పదజాలం తో ‘పచ్చ’ సమూహం ఎదురు దాడి. ప్రశ్నోత్తరాల సమయం లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అడిగిన మరో ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖల మంత్రి అచ్చెన్నాయుడు లేచి ‘నిరుద్యోగ భృతి పథకం’ మా పరిశీలనలోనే లేదంటూ నిస్సిగ్గుగా బుకారుుంపులకు దిగారు. పూర్తి రుణమాఫీ హామీ ఇవ్వలేదంటూ చంద్రబాబు రెండు నెలల కిందట మాట మార్చిన తీరు మరిచిపోక ముందే మరోసారి మడం తిప్పడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

బాబు మాటలు  ఒట్టి బూటకం : ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా బాబు వస్తే జాబు వస్తుందని ఆశించి మోసపోయాం. బీటెక్ పూర్తి చేసి 3 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి రూ.2 వేలు ఇస్తామని ప్రకటించారు. అది కూడా బూటకమే.  - షేక్ హబీబున్నీసా, బీటెక్ విద్యార్థిని, వైపాలెం

 అబద్దాల్లో చంద్రబాబు  గిన్నిస్ రికార్డ్
ఎన్నికలకు ముందు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ప్రకటించిన చంద్రబాబు నేడు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి పథకం లేదని ప్రకటించడం దారుణం. నిత్యం అబద్దాలు చెబుతూ చంద్రబాబు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేందుకు యత్నిస్తున్నారు. వెంటనే నిరుద్యోగులకు రూ.2వేలు భృతి ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. - మారెడ్డి రామకృష్ణారెడ్డి,  నిరుద్యోగి, ఒంగోలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చేసిన హడావిడి చూసి నిరుద్యోగులు బాబుకు ఓట్లు వేసి మోసపోయారు. చంద్రబాబు వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు రావడం సంగతి ఎలా ఉన్నా వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తున్నా కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. బాబు మారాడని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా మోసపోయారు.

కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఆశలు పెట్టుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మూడు నుంచి నాలుగువేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించారు.

స్కూల్క్ రేషనలైజేషన్ చేయడం రాజీవ్ విద్యామిషన్ ద్వారా బీఈడీ అర్హతతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్‌ను తొలిగించి వారి స్థానంలో ఉన్న  టీచర్లను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

2011లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన  గ్రూప్- 1, గ్రూప్- 2, గ్రూప్ -4 నోటిఫికే షన్,  2014 డీఎస్సీ నోటిఫికేషన్ తప్ప ఎటువంటి నియమకాలు చేపట్టలేదు. సుమారు మూడేళ్లుగా నోటిఫికేషన్‌ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు చాలా మందికి వయోఃపరిమితి దాటిపోతుంది.

దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పంచాయతీ  కార్యదర్శులు, వీఆర్వోలు, కానిస్టేబుళ్లు, గ్రూప్-4, గ్రూప్-2 వంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లు రావడం లేదు.

ఎప్పటి నుంచో వాయిదా పడి మొత్తానికి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చినా, ఇంతవరకూ నియామకాలు జరగలేదు. సర్టిఫికేట్ల వెర్ఫికేషన్‌కే పరిమితమయ్యారు.

నిరుద్యోగులకు నెలనెలా జీవనభృతి ఇస్తామని నోటి మాట కాకుండా మ్యానిఫెస్టోలో ఐదో వాగ్దానంగా పొందుపరిచారు.అధికారికంగా నమోదు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వచ్చినా రెండేళ్లలో రూ.288 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఊసే చంద్రబాబు ఎత్తడం లేదు. రెండురోజుల క్రితం ప్రకటించిన బడ్జెట్‌లో కూడా దీని ఊసు లేదు.

రేషన్‌డీలర్లను కూడా రాజకీయ కారణాలతో తొలగించారు. బాబు వచ్చిన తర్వాత రోడ్డున పడ్డ ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దొరకక చిన్నా, చితక పనులు, కూలీపనులు చేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. 

ఐకేపీ కింద సేంద్రీయ వ్యవసాయం చేసే క్లస్టర్ యాక్టివిస్ట్, విలేజ్ యాక్టిస్‌లుగా ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇప్పట్లో గృహనిర్మాణాలు ఏమీ లేవంటూ మిమ్మల్ని భరించలేమంటూ అవుట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను, సర్వేయర్లు, డేటా ఎంట్రీ అపరేటర్లను తొలగించారు. వీళ్లకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా  లబ్ధిదారుల రుణాల నుంచి రూ.5వేలు కట్ చేసి జీతం ఇస్తారు. అలాంటి వీరిని కూడా తొలగించారు.

మరిన్ని వార్తలు