వెంకయ్యనాయుడు తీరు దారుణం

16 Jun, 2017 01:56 IST|Sakshi
వెంకయ్యనాయుడు తీరు దారుణం
 ఆచంట : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవ చూపడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ ధ్వజమెత్తారు. ఆచంట మండలంలోని దళిత ప్రజాప్రతినిధులను స్థానిక రామేశ్వరస్వామి సత్రంలో గురువారం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేష్‌ మాట్లాడుతూ కనీసం వార్డు సభ్యునిగా కూడా గెలవలేని వెంకయ్యనాయుడుకు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని కోరిన ఆయన ఇప్పుడు మాటమార్చి తన నైజాన్ని బయటపెట్టారన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను మానుకోకపోతే వెంకయ్యనాయుడుకు, తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడతామన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమానికి ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు ప్రధాన కార్యదర్శి కొల్లాపు వేణు, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, కోశాధికారి ఏనుగుపల్లి చంద్రశేఖర్, ఆచంట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిసరెళ్ల శ్రీనివాస్, పోడూరు మండల అధ్యక్షుడు నేలపాటి రాజబాబు, ఆచంట, పెనుగొండ మండలాల అధ్యక్షులు రావి నాగరాజు, బల్లాశ్రీనివాస్, పోడూరు మండల ఉపాధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, ఆచంట యువజన విభాగం అధ్యక్షుడు కట్టా శిరీష, సర్పంచ్‌ బీర తిరుపతమ్మ, ఎంపీటీసీ కట్టా జాన్‌మోషే, జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్‌ పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు