జిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తాం

14 Aug, 2016 23:42 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
వంశధార రెండోదశ పూర్తి చేసి తీరుతాం
వంతెన నిర్మాణానికి శంకుస్థాపన సభలో మంత్రి అచ్చెన్నాయుడు 
 
నువ్వరేలవు( వజ్రపుకొత్తూరు): శ్రీకాకుళం జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో ఆదివారం రూ.35.38 కోట్లతో ఉప్పుటేరుపై వంతెన  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వంశధార రెండో దశ పూర్తి చేస్తామని చెప్పారు. ప్రకృతితో ప్రతి ఒక్కరూ అనుసంధానం కావాలని, ఈ స్ఫూర్తితోనే నదుల అనుసందానం చేపట్టి గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. టెక్కలి, వజ్రపుకొత్తూరు మండల పరిషత్‌ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నట్టు ప్రకటించారు. ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ నువ్వలరేవులో పొగురు తీసేందుకు  కృషి చేస్తానన్నారు.
 
జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ జిల్లాలో తీరం వెంబడి 193 కిలో మీటర్ల పరిధిలో 10 వరుసల్లో సరుగుడు, తాటి చెట్లు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సంవరక్షణ బాధ్యత మహిళా బృందాలకు అప్పగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ బ్రహ్మారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఎంపీపీ జి.వసంతరావు, జెడ్పీటీసీ ప్రతినిధి ఉదయ్‌కుమార్, సర్పంచ్‌ బి. ధర్మారావు, ఉప సర్పంచ్‌ ఎం.రఘు పెద్ద బెహరా మధుసూదన్, స్థానిక ఎంపీటీసీ ప్రతినిధులు వెంకటేష్, ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పి. విఠల్‌రావు, ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోవిందరాజులు, వెంకట్‌కుమార్‌ చౌదరి, ఎంపీడీఓ వి.తిరుమలరావు, మండల పార్టీ అధ్యక్షుడు బి. శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు