మహిళ దారుణ హత్య

9 Feb, 2017 22:47 IST|Sakshi
మహిళ దారుణ హత్య

పుట్లూరు : మండలంలోని బాలాపురం ఎస్సీ కాలనీలో లక్ష్మీదేవి(40) అనే మహిళ(దివ్యాంగురాలు) గురువారం దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల కథనం మేరు.. భర్త రంగనాయకులు ఎనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో మరణించగా, అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో పాటు అత్తతో కలసి ఉంటోంది. కూలీ పనులకు వెళ్లి కుమారుడు దస్తగిరిని పాలిటెక్నిక్‌ చదివిస్తుండగా, కుమార్తె కుళ్లాయమ్మకు నెల రోజుల కిందట వివాహం కూడా చేసింది. గురువారం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా గాయపరచి సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరు, రైస్‌ కుక్కర్‌ వైర్లను గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశారు.

గమనించిన స్థానిక కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. తాడిపత్రి రూరల్‌ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ సురేశ్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుమారుడు దస్తగిరి ఫిర్యాదు మేకరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి పోలీసులు జాగిలాన్ని రప్పించారు. అది లక్ష్మీదేవి ఇంటి నుంచి బాలాపురం బస్‌షెల్టర్‌ వద్దకు వెళ్లి ఆగిపోయింది. క్లూస్‌ టీం సహాయంతో హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషించారు. కాగా ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పి.చింతలపల్లికి చెందిన ఓ వ్యక్తి తరచూ ఎస్సీ కాలనీకి వచ్చి వెళ్లేవాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాగా హత్య జరిగిన అనంతరం అతడు గ్రామంలో లేకపోవడంతో పాటు ఫోన్‌ పని చేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

>
మరిన్ని వార్తలు