డిజిటల్ జాబ్స్.. ఫ్యూచర్ ట్రెండ్స్

15 Jul, 2014 00:16 IST|Sakshi
డిజిటల్ జాబ్స్.. ఫ్యూచర్ ట్రెండ్స్

రాబోయే రోజుల్లో పంచభూతాల మాదిరి ఐదు డిజిటల్ టెక్నాలజీ విభాగాలైన మొబిలిటీ, సోషల్ మీడియా, అనలిటిక్స్, క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్... కొలువులకు పట్టం కడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత రంగాలతోపాటు ఇతర రంగాల్లో పుష్కలమైన అవకాశాలున్నప్పటికీ...  ఏటా లక్షల మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేస్తుండడంతో నైపుణ్యాలున్న అభ్యర్థుల ఎంపిక కంపెనీలకు సవాలుగా మారుతోంది. దాంతో సరిపడ నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన వారిని నియమించుకోవడానికి నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్నాయి. కొత్తగా ఆలోచించే నైపుణ్యం, సంస్థకు అవసరమైన ప్రతిభ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలు కలిగిన హైదరాబాద్‌లో మరికొద్ది రోజుల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భవిష్యత్ రిక్రూట్‌మెంట్ ట్రెండ్స్‌పై విశ్లేషణ..  
 
  అభివృద్ధి పథంలో ఐటీ
 మ్యానుఫాక్చరింగ్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, టెలికాం తదితర రంగాలన్నింటిలో ఐటీ పరిజ్ఞానం అవసరం.  రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్(రిమ్), ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్(ఈఆర్‌పీ, ఎస్‌ఏపీ, ఒరాకిల్), బీపీఓ, కేపీఓ, ఇంజనీరింగ్ సొల్యూషన్స్, టెస్టింగ్ తదితర రంగాల్లో గత మూడు నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి నెలకొంది అంటున్నారు టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజినల్ హెడ్, టెలికామ్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న. అందుక నుగుణంగా ఆయా విభాగాల్లో యువతకు అవకాశాలు లభించనున్నాయని పేర్కొంటున్నారు.
 
 పంచ డిజిటల్ శక్తులు
 ఐబీఎం మెయిన్ ఫ్రేమ్స్‌తో మొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిణామ క్రమం.. ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. విభిన్న రంగాల్లో అభివృద్ధితో డిజిటల్ విప్లవానికి తెరలేచింది. పంచభూతాల మాదిరి ఐదు డిజిటల్ శక్తులు  అందుబాటులోకొచ్చాయి. మొబిలిటీ, సోషల్ మీడియా, అనలిటిక్స్, క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనే ఈ పంచ శక్తులు రానున్న రోజుల్లో ఊహించని రీతిలో విస్తరించనున్నాయని విశ్లేషించారు రాజన్న. ఆయా టెక్నాలజీల్లో నైపుణ్యాలు సొంతం చేసుకున్నవారికి అవకాశాలకు కొదవ ఉండదని ఆయన చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచడంతో ఇన్సూరెన్స్, డిఫెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్‌స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యువతలో ఉద్యోగ నైపుణ్యాలు, ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ మెరుగుపరచేందుకు ఉద్దేశించిన నేషనల్ మల్టి స్కిల్ ప్లాన్; రూ.500కోట్లతో ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటు; చిన్నతరహా  పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్..  ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొత్త కొలువులకు మార్గం వేస్తాయని హెచ్‌ఆర్ నిపుణులు పేర్కొంటున్నారు.
 
 ఆశాజనకంగా జాబ్ మార్కెట్
  గతేడాది దేశవ్యాప్తంగా 1.6 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించాయి.  ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుంది. అయితే కంపెనీల నియామక విధానాల్లో కొన్ని సహజమైన మార్పులు నెలకొంటున్నాయి. గతేడాదితో పోల్చితే ఐటీ పరిశ్రమ అభివృద్ధి పథంలో పయనించనుంది. 13 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేయనుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఐటీతోపాటు అన్ని రంగాల జాబ్ మార్కెట్ కూడా 10-11 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశముంది. దేశీయ సేవల ద్వారా లభించే 30శాతం ఆదాయంలో ఇటీవలి కొన్ని త్రైమాసికాల్లో తగ్గుదల కనిపించినా మళ్లీ పుంజుకుంటోంది. రైల్వేలు, హెల్త్‌కేర్ రంగాల్లో అభివృద్ధి చోటుచేసుకునే అవకాశం ఉంది. తదనుగుణంగా ఉద్యోగావకాశాలూ పెరగనున్నాయి.
 
 ఆన్‌డిమాండ్ హైరింగ్
 నియామక విధానాల మార్పుల్లో భాగంగా కంపెనీలు ఆన్‌డిమాండ్ హైరింగ్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటివరకు 60 శాతం క్యాంపస్ నియామకాలుంటే.. 40 శాతం ఆన్‌డిమాండ్ హైరింగ్ లేదా ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్ (ఈపీ) హైరింగ్ ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీలు క్యాంపస్ నియామకాల కంటే ఆన్‌డిమాండ్ హైరింగ్‌కే మొగ్గుచూపుతున్నాయి. ఎందుకంటే.. క్యాంపస్ నియామకాలు ఏడాదిలో ఏదో ఒక సీజన్‌లో మాత్రమే జరుగుతుంటాయి. అంటే 2015-16కి గాను త్వరలో క్యాంపస్ సెలక్షన్స్ జరుగనున్నాయి.
 
 ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులను భారీ సంఖ్యలోనే కంపెనీలు ఎంపిక చేసుకునే అవకాశముంది. అయితే, వారికి ఆఫర్ లెటర్ ఇచ్చి, కోర్సు పూర్తి పూర్తయ్యేవరకు కంపెనీలు వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఆన్‌డిమాండ్ హైరింగ్ బాటపడుతున్నాయి. తమ అవసరానికి అనుగుణంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అంతేగానీ నియామకాలను తగ్గించడం లేదు. ఈ విధమైన నియామకాల్లోనూ కళాశాలతో సంబంధం లేకుండా ఏ విద్యార్థైనా పాల్గొనవచ్చు.
 
 
 కరిక్యులం ప్రధానం
 కంపెనీలు ప్రధానంగా కరిక్యులం, సిలబస్ పరిధిలోనే విద్యార్థి ప్రతిభను పరీక్షిస్తాయి. అంతకుమించి ఎక్కువగా ఆశించేదీ ఉండదు. పరిశ్రమ అవసరాలకు సరితూగే రీతిలో ఎప్పటికప్పుడు మనవిశ్వవిద్యాలయాలు కరిక్యులంలో మార్పులు చేస్తూనే ఉన్నాయి. కాబట్టి విద్యార్థి కరిక్యులంను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకోవాలి. కరిక్యులంలో పరిపూర్ణత సాధిస్తే సులభంగా జాబ్‌ను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు.
 
 నియామక ప్రక్రియ ఇలా
 ‘నియామకాల్లో కంపెనీల వారీగా స్పల్ప తేడాలున్నప్పటికీ.. దాదాపు అన్ని కంపెనీలు అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్‌డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఇంటర్వ్యూలో టెక్నికల్, హెచ్‌ఆర్ అనే రెండు రకాలుంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూలో అభ్యర్థి కరిక్యులం, అకడమిక్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలో అభ్యర్థి పర్సనాలిటీని అంచనా వేస్తారు. బృందంతో కలిసి పనిచేసే సామర్థ్యం, అభ్యర్థి దృక్పథం, అణకువ, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలను పరీక్షిస్తారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రాత పరీక్షకు బదులు ఆన్‌లైన్ టెస్ట్‌లను కూడా నిర్వహిస్తున్నాయని సైయింట్ కంపెనీ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రెసిడెంట్ బి.అశోక్‌రెడ్డి తెలిపారు.
 
 నైపుణ్యాలే గీటురాయి
 ఐటీ కంపెనీల నియామకాల్లో సంప్రదాయ కోర్సునభ్యసించిన విద్యార్థులకూ అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ సంబంధిత సర్వీసులైన రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్(రిమ్), బీపీఓ, కేపీఓ తదితర రంగాల్లో సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల్లోనూ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కనీసం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో పూర్తిస్థాయి నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఏదైనా డేటాబేస్‌లోనూ ప్రావీణ్యం పొందాలి. ఒక శాప్ లేదా ఒరాకిల్ తదితర ఈఆర్‌పీ పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, బృందనైపుణ్యాలను పెంచుకోవాలి. ఏదైనా టెక్నాలజీ విభాగంలో పనిచేయడానికి సిద్ధమవ్వాలి.
 
 అంతేకాకుండా ఐటీ కంపెనీలు ఐటీ సంబంధిత గ్రూప్‌లతోపాటు కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకూ సమప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎందుకంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక హారిజాంటల్ ప్రక్రియ. అంటే.. ప్రతి రంగంలోనూ ఈ రంగం వినియోగం ఉంటుంది. కాబట్టి ఐటీ సంస్థలకు ఐటీ నిపుణులతోపాటు సంబంధిత రంగ నిపుణుల అవసరం ఉంటుంది. అందుకే కోర్ బ్రాంచ్ ఉత్తీర్ణులను కూడా ఐటీ సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. అలాగే బీఎస్సీ తదితర కోర్సులు చదివిన విద్యార్థులకు సైతం కొన్ని కంపెనీలు సంబంధిత శిక్షణనిచ్చి ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నాయి.
 
 సైన్స్ టు సాఫ్ట్‌వేర్
 ‘భారత ఐటీ రంగంలో మంచి అవకాశాలున్నాయి. విద్యార్థులు జాబ్ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా తమను తీర్చిదిద్దుకోవా లి. బీఎస్సీ కోర్సులనభ్యసించిన వారూ సాఫ్ట్‌వేర్ నిపుణులు గా కెరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు టీసీఎస్ అవకాశం కల్పిస్తోంది. ఇగ్నైట్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది సైన్స్ టు సాఫ్ట్‌వేర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్. బీఎస్సీ విద్యార్థులకు మూడు, నాలుగు నెలలపాటు శిక్షణ ఇచ్చి ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దుతారు. ఐటీకి దీటుగా ఎనర్జీ, పవర్, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్ డెవలప్ మెంట్ రంగాల్లోనూ ఉద్యోగాలున్నాయి. పవర్ అండ్ ఎనర్జీ రంగం ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించింది. అభ్యర్థులు నైపుణ్యాలు పెంచుకుంటూ అవకాశాలను అంది పుచ్చుకోవాలి’  
 - వి. రాజన్న, వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజినల్ హెడ్, టీసీఎస్

మరిన్ని వార్తలు