వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించరాదు

6 May, 2014 01:35 IST|Sakshi

భోపాల్: కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు, తదితరులను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వారు సెక్యూరిటీ పరిధిలో ఉన్నా, లేకపోయినా కూడా కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండరాదని ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా, ఎలాంటి ఇతర ప్రభావాలు పడకుండా చూడటం తమ ఉద్దేశమని కమిషన్ తెలిపింది. భద్రతా పరిధిలోని ఎమ్మెల్యే లేదా రాజ్యసభ సభ్యుడిని పోలింగ్ ఏజెంట్ లేదా కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించవచ్చా?

అంటూ పుదుచ్చేరి ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టతను కోరడంతో ఈసీ ఈ మేరకు వివరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, సాయుధ అంగరక్షకులతో కూడిన భద్రత ఉన్న ప్రజా ప్రతినిధులు కౌంటింగ్ ఏజెంట్‌గా ఉండరాదని గతంలో ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఉద్యోగులు చాలా మంది ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి.. వారు ప్రభావితం కాకుండా విధులు నిర్వర్తించేందుకుగాను మున్సిపల్ మేయర్లు, జిల్లా పరిషత్, పంచాయతీ వంటి స్థానిక సంస్థల చైర్మన్లు, అధ్యక్షులు కూడా ఏజెంట్లుగా ఉండరాదని తాజాగా నిర్ణయించినట్లు ఈసీ పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు