ముంబై: భారత్లోని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో రోజులో తేలనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగానే కాకుండా పాకిస్తాన్, దుబాయి లాంటి దేశాల్లో కూడా బెట్టింగ్ల జోరందుకుంది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర నగరాల్లో భారీఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. మొత్తం మీద ఫలితాల అనంతరం12 వేల కోట్ల రూపాయల మేర చేతులు మారే పరిస్థితి ఉందని అంచనా.
భావి ప్రధానిగా బెట్టింగ్రాయుళ్లు నమ్ముతున్న వారిలో బీజేపీ అభ్యర్థి నరేంద్రమోడీనే ప్రథమస్థానంలో ఉన్నారు. ఆయనపై పెడుతున్న బెట్టింగ్ 2 పైసలు మాత్రమే. ఆయన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై గత వారంలో పది రూపాయలు ఉండగా, ఇప్పుడు అది 35 రూపాయలకు పడిపోయింది.
వీరిద్దరిపైనే కాకుండా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) నెగ్గే స్థానాలపై కూడా భారీగా బెట్టింగ్ నడుస్తోంది. 220 స్థానాలైతే 30 పైసలు, 230 స్థానాలైతే 40 పైసలు, మేజిక్ ఫిగర్ 272 స్థానాలైతే ఒక రూపాయి చొప్పున బెట్టింగ్ జరుగుతోంది. గత వారానికి, ఈ వారానికి బెట్టింగ్ నగదులో మార్పు వచ్చింది. ఎగ్జిట్పోల్ ఫలితాలు వెలువడేసరికి బెట్టింగ్లో బాగా మార్పు చోటుచేసుకుంది.