అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి శత్రుచర్ల

4 May, 2014 18:42 IST|Sakshi
అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి శత్రుచర్ల

హైదరాబాద్: గెలుపే లక్ష్యంగా టీడీపీ బెరితెగిస్తోంది.  ఓటుకు నోటు సూత్రాన్ని ఆ పార్టీ  పక్కా ఫాలో అవుతోంది. టిడిపి నేత, తాజా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అడ్డంగా దొరికిపోయారు.  విజయరామరాజు శ్రీకాకుళం జిల్లాలో స్వయంగా డబ్బు పంపకాలకు దిగారు. పాతపట్నం, ఎల్లంపేట మండలాల్లో  ఒక్కొ గ్రామానికి 15 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు.

ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయల  చొప్పున 40 కుటుంబాలకు డబ్బు పంపించానని విజయరామరాజు స్వయంగా చెబుతూ  దొరికిపోయారు. అంతేకాదు, డబ్బును అందజేయడంలో అనుచరులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆయన పాతపట్నం శాసనసభ స్థానానికి టిడిపి తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శత్రుచర్ల ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు చూపే వీడియోని కూడా చూడవచ్చు. శత్రుచర్ల నిర్వాకంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయనేతలు చేయాల్సినది ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అల్లిమడుగు గ్రామంలో టీడీపీ వాళ్లు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. గ్రామంలోని ఎస్టీల దగ్గరికి వెళ్లి మీరు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని, వాళ్ల దగ్గర ఓ బాండు, మరో వైట్‌ పేపర్‌ మీద సంతకాలు తీసుకుంటున్నారు. సుమారు 50 మంది దగ్గర ఇలా సంతకాలు తీసుకున్నట్లు సమాచారం అందింది. మీడియా వాళ్లు అక్కడి రావడంతో టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు. స్థానిక టీడీపీ అభ్యర్థే ఇలా సంతకాలు సేకరించారని తెలిసింది. దీనిపై ఆయన్ను సంప్రదించగా,  ఎస్టీలు కాబట్టి మీరు కరెంటు బిల్లులు కట్టక్కర్లేదని, అసలు మీటర్లు లేని వాళ్లు తీసుకోవాలని చెప్పినట్లు  బుకాయించారు.

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నేతల్లో ఓటమి భయం పెరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుకి ఆఖరి అస్త్రంగా మద్యం, డబ్బులు ఎరవేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తలారి ఆదిత్య ప్రచారంలో మద్యం ఏరులై పారుతోంది. ప్రచారానికి వచ్చిన వారికి ఫుల్లుగా మద్యం , డబ్బులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎన్.సి.వి.నాయుడు మద్యం పంపిణీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగు తమ్ముళ్ళు మందుబాబులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి, బిజెపి కార్యకర్తలు యథేచ్ఛగా మద్యపానం చేశారు. వైన్ షాపును చుట్టుముట్టిన కార్యకర్తలు ఎగబడి మరీ మద్యం తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్లపైనే సేవించారు. ఇంకొందరైతే ఓ మేడపైకి ఎక్కి చక్కగా పార్టీ చేసుకున్నారు. బాబు ప్రచారానికి రాక ముందే మందులో తూగిన తెలుగు తమ్ముళ్ళకు కొందరు కమలం సోదరులు కూడా తోడయ్యారు. అంతా కలిసి విచ్చలవిడిగా మద్యం సేవించారు. ఆలస్యంగా ఆచంట వచ్చిన బాబు అక్కడి పరిస్థితి చూసి ఏమీ ప్రసంగించకుండానే జై తెలుగుదేశం అంటూ ముందుకు సాగారు. క్రమశిక్షణకు మారుపేరుగా తమకు తాము చెప్పుకునే తెలుగుదేశం కార్యకర్తలు ఇలా తమ నిజ స్వరూపం చూపడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని వార్తలు