టీడీపీ ప్రచార జీపు ఢీకొని బాలుడి దుర్మరణం

7 Apr, 2014 00:53 IST|Sakshi
టీడీపీ ప్రచార జీపు ఢీకొని బాలుడి దుర్మరణం

నారాయణపేట, న్యూస్‌లైన్ :  టీడీపీ ప్రచార జీపు ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందగా, కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనలో ఓ వాహనం ధ్వంసం కాగా, ఓ హోటల్ డబ్బాకు బాధితులు  నిప్పంటించారు.  వివరాలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం కోటకొండలో టీడీపీ ప్రచార జీపు తిరుగుతోంది.
 
 అదే సమయంలో గ్రామ బొడ్రాయి సమీపంలో బాల్‌రాజ్ (6) కంకర కుప్పపై ఆడుకుంటున్నాడు. అతన్ని గమనించకుండానే డ్రైవర్ వేగంగా వాహనాన్ని నడపడంతో ఆ బాలుడు దుర్మరణం చెందాడు. దీంతో ఆగ్ర హించిన ప్రజలు రాళ్లు, కర్రలతో అద్దాలు పగులగొట్టి జీపును ధ్వంసం చేశారు. దాని యజమాని ఇంటిముందు మృతదేహంతో బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని  సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పట్టుబట్టారు. దీంతో గ్రామ పెద్దలతో చర్చించి అందుకు సరేననడంతో వారు శాంతించి వెనుదిరిగారు.
 

మరిన్ని వార్తలు