సూడాన్

12 Apr, 2015 00:05 IST|Sakshi
సూడాన్

ఖండం: ఆఫ్రికా
వైశాల్యం:  18,86,068 చదరపు కిలోమీటర్లు
జనాభా:  3,72,89,406 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: ఖార్టూమ్
ప్రభుత్వం: డామినంట్ పార్టీ ఫెడరల్ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
కరెన్సీ: సూడాన్ పౌండ్
భాషలు: అరబిక్, ఇంగ్లిష్, నూబియన్, స్థానిక భాషలు
మతం: 73 శాతం ఇస్లాం, 18 శాతం ఆటవిక తెగలు, 9 శాతం క్రైస్తవులు
వాతావరణం: జనవరి 15 నుండి 32 డిగ్రీలు, జూన్ 26 నుండి 41 డిగ్రీలు.
పంటలు:  పత్తి, ఖర్జూరం, వేరుశనగ, నువ్వులు, గోధుమ, బీన్స్, జొన్నలు.
పరిశ్రమలు: చమురుశుద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంటు
స్వాతంత్య్రం: 1956, జనవరి 1
సరిహద్దులు: ఈజిప్టు, లిబియా, చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, జైరీ, ఉగాండా, కెన్యా, ఇథియోపియా, ఎర్రసముద్రం.

చరిత్ర
ఆఫ్రికా ఖండంలో సూడాన్ అతిపెద్ద స్వతంత్ర దేశం. వైశాల్యంలో పెద్దగా ఉన్నా, నైలు నది ప్రవహిస్తున్నా దేశంలో ఎప్పుడూ ఆహారకొరత, కరువు, ఆర్థికమాంద్యం, రాజకీయ అస్థిరత మొదలైనవి దేశాన్ని పట్టి కుదిపేస్తూ ఉన్నాయి. ఉత్తర సూడాన్‌లో ముస్లింలు, దక్షిణ సూడాన్‌లో నలుపు ఆఫ్రికన్‌లు మధ్య భాగంలో స్థానిక తెగల ప్రజలు... ఇలా అనేక రకాల సాంప్రదాయాల ప్రజలు ఈ దేశంలో నివసిస్తూ తమ స్వంత అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్కొక్కసారి యుద్ధాలు చేస్తున్నారు.

ఒకప్పుడు సూడాన్‌లో రెండు ప్రత్యేకమైన నాగరికతలు వెల్లివిరిసాయి. ఒకటి నూబియా, రెండవది కుశ్. ఆరవ శతాబ్దంలో సూడాన్ ప్రాంతాన్ని పరిపాలించిన మూడు గొప్ప సామ్రాజ్యాలు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నాయి. వారు దేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించకుండా నిరోధించారు. అయితే 18వ శతాబ్దంలో ఈజిప్టు రాజు ముహమ్మద్ అలీ సూడాన్ ఉత్తర భాగాన్ని ఆక్రమించుకొని సూడాన్‌లో ఇస్లాం మతాన్ని వ్యాప్తిచేశాడు. ఇస్మాయిల్ పాషా అనే రాజు సూడాన్‌లో అన్ని భాగాలనూ ఆక్రమించి ఆ ప్రాంతానికి బ్రిటిష్ జాతీయుడిని గవర్నర్ జనరల్‌గా నియమించాడు.క్రీ.శ.1881లో దైవదూత అనబడే ముహమ్మద్ అహమది సూడాన్‌లో ఇస్లాం మతాన్ని పటిష్టం చేసి దేశంలో ఉన్న విదేశీయులను బయటికి తరిమేశాడు. అయితే 1898లో బ్రిటిషర్లు ఇక్కడి రాజులను ఓడించి దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. చివరికి 1956లో దేశానికి స్వతంత్రం సిద్ధించింది.
 
పరిపాలనా పద్ధతి
దేశపాలన రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. దేశంలో 18 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఈ రాష్ట్రాలను తిరిగి 133 జిల్లాలుగా విభజించారు. ఆ 18 రాష్ట్రాలు... అల్ జజీరా, అల్ ఖదారిఫ్, బ్లూనైల్, రివర్‌నైత్, వైట్‌నైల్, సెంట్రల్ డర్ఫర్, ఈస్ట్ డర్ఫర్, నార్త్ డర్ఫర్, సౌత్ డర్ఫర్, వెస్ట్ డర్ఫర్, కస్సాలా, కార్టూమ్, నార్తర్న్ రెడ్‌సీ, నార్త్ ఖుర్దుఫాన్, సౌత్ ఖుర్దూప్రాన్, వెస్ట్ ఖుర్దూఫ్రాన్, సెన్నార్‌లు.

ప్రజలు-సంస్కృతి
సూడాన్ దేశంలో దాదాపు 597 తెగల ప్రజలు ఉన్నారు. వీరు 400కు పైగా భాషలను మాట్లాడతారు. అధికశాతం ఇస్లాం మత ప్రజలే కాబట్టి వీరంతా అరబ్బీ భాషను మాట్లాడతారు. పురుషులు సాధారణంగా పాదాల వరకు ఉండే పొడవాటి స్కర్ట్‌లాంటి దుస్తులు ధరిస్తారు. దీనిని జులాబియా అంటారు. మహిళలు కూడా ఇలాంటి స్కర్టునే ధరిస్తారు. అలాగే తలను కప్పుతూ మరో గుడ్డ చుట్టుకుంటారు. ముఖాన్ని పూర్తిగా కప్పుకోరు. వీరు రంగురంగుల దుస్తులు ధరిస్తారు. పురుషులు తలకు ప్రత్యేకమైన తలపాగా ధరిస్తారు. యువతీ యువకులు మాత్రం షర్టు, ప్యాంటు ధరిస్తారు.
 
పంటలు-పరిశ్రమలు
దేశ దక్షిణ భాగంలో పత్తి పంట అధికంగా పండుతుంది. వేరుశనగ, నువ్వులు, గోధుమ, జొన్న, బీన్స్ పంటలు కూడా ఈ దక్షిణ భాగంలోనే అధికంగా పండుతాయి. ఉత్తరభాగంలో నూబియన్, సహరా ఎడారులు ఉన్నాయి. ఇక్కడే నైలు నది ఈజిప్టు దేశంలోకి ప్రవేశిస్తుంది. సూడాన్ దేశంలో గమ్ అరబిక్ ప్రపంచంలోనే అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. దీనిని మందులు, ఇంకు తయారీలో ఉపయోగిస్తారు. వేరుశనగ కూడా బాగా పండుతుంది.బెంటియు ప్రాంతంలో చమురు, సహజ వాయువులను కనుగొన్నారు. దేశంలో సిగరెట్లు, భవన నిర్మాణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తులు, చక్కెర, దుస్తుల పరిశ్రమలు ఉన్నాయి.

ఆహారం
సూడాన్ దేశస్థులు సాధారణంగా గోధుమ, జొన్న పిండితో చేసిన దళసరిగా వుండే రొట్టెలను తింటారు. బ్రెడ్డు, గొర్రె, మేక మాంసం అధికంగా తింటారు. ఫుల్ మెడమిస్ అనే ఆహారం దేశ వ్యాప్తంగా వాడుకలో ఉంది. ఇక దేశంలో బీరు, బ్రాందీ లాంటి మత్తుపానీయాలు పూర్తిగా నిషిద్ధం. అయితే ఖర్జూరపండ్లతో తయారుచేసే పానీయం చాలా మంది తాగుతారు. కిస్రా, అసీదా, గురస్సా, అనే పేర్లతో బ్రెడ్డు తయారుచేస్తారు.
 
ఖార్టూమ్ నగరం
దేశ రాజధాని ఖార్టూమ్ నగరం వైట్‌నైల్, బ్లూనైల్ నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ఈ రెండు నదులు విక్టోరియా సరస్సు నుండి ప్రారంభమవుతాయి. అయితే బ్లూనైల్ జన్మస్థలం ఇథియోపియా. ఈ రెండు నదులు అల్ మోగ్రాన్ అనే ప్రదేశంలో కలుస్తాయి. ఒకప్పటి ఈజిప్టు రాజు ఈ ఖార్టూమ్ నగరాన్ని అభివృద్ధిపరిచాడు. జులై, ఆగస్ట్ నెలలలో ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది. నగరంలో పారే నైలునది మీద అనేక బ్రిడ్జిలు నిర్మించారు. నగరం చుట్టూ ఉన్న మరో నాలుగు నగరాలు నెలకొని ఉన్నాయి. వీటిని నైలునది బ్రిడ్జిలు కలుపుతూ ఉంటాయి. నగరంలో ఉన్న నేషనల్ మ్యూజియంలో సూడాన్ దేశ గత చరిత్రను తెలియజేసే వస్తువులు, పరికరాలు ఆనవాళ్ళతో నిండి ఉంది. ప్యాలెస్ మ్యూజియం, రాష్ట్రపతి భవనం చూడదగిన నిర్మాణాలు. గ్రేట్ మాస్క్‌తో పాటు ఓమ్ డుర్మన్‌లో జరిగే ఒంటెల మార్కెట్ చూడదగినవి.
 
చూడదగిన ప్రదేశాలు
 
మేరో పిరమిడ్స్
పిరమిడ్‌లు అనగానే ఈజిప్టు గుర్తొస్తుంది. అయితే దేశంలో ఉన్న మేరో నగరంలో కూడా అద్భుతమైన పిరమిడ్లు ఉన్నాయి. ఈ నగరం నైలు నది తీరంలో ఉంది. ఈ నగరం ఒకప్పుడు కుష్ రాజులకు రాజధానిగా వెలుగొందింది. ఇక్కడ 200కు పైగా పిరమిడ్‌లు ఉన్నాయి. వీటిని మూడు గ్రూప్‌లుగా విబజించారు. ఈ పిరమిడ్‌లను నూబియన్ పిరమిడ్‌లు అనికూడా అంటారు. నూబియా ప్రాంతంలో కట్టారు కాబట్టి అలా పిలుస్తారు.

ఈ ప్రాంతం ఒకప్పుడు ఈజిప్టు దేశంలో భాగంగా ఉండేది. పిరమిడ్లు కట్టడం అనే సాంప్రదాయం ఈజిప్టు రాజుల వంశంలో ఉండింది. అందుకే ఈ ప్రాంతంలో కూడా పిరమిడ్ల నిర్మాణం ఆ కాలంలో జరిగింది. ప్రస్తుతం చాలా పిరమిడ్‌లు శిథిల దశలో ఉన్నాయి. ఈ పిరమిడ్లు ఆరు నుండి ముప్పై ఫీట్ల ఎత్తులో నిర్మించబడ్డాయి. ఈ పిరమిడ్‌లలో ఆ కాలం నాడు మరణించిన వారి శవంతోపాటు ఎంతో బంగారం, ధనం ఉంచేవారు. వాటికోసం ఈ పిరమిడ్‌లను కొల్లగొట్టి ఆ ధనాన్ని దొచుకుపోయారు.
 
గెబెల్ బర్కల్ పిరమిడ్‌లు
గెబెల్ బర్కల్ ఒక చిన్న కొండ. ఇది దేశ ఉత్తర భాగంలో ఉంది. ఇది నైలు నది తీరంలో ఉంది. ఇక్కడ 200కు పైగా పిరమిడ్‌లు ఉన్నాయి. వీటిని కుష్ పిరమిడ్‌లు అని కూడా అంటారు. ఈజిప్టులో ఉన్న పిరమిడ్‌ల కన్నా ఇవి పొట్టిగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఈ పిరమిడ్‌లతోపాటు 13 దేవాలయాలు, మూడు రాజభవనాలు ఉన్నాయి. వీటిని 18వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇవన్నీ పూర్వం ఈజిప్టు రాజులు నిర్మించినవే. ఈజిప్టు రాజు టుట్ మోస్-ఐఐఐ వీటిని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శిస్తారు.
 
పోర్ట్ సూడాన్
ఈ ఓడరేవు సూడాన్ ఎర్ర సముద్ర తీరంలో ఉంది. 1909లో ఈ ఓడరేవును నిర్మించారు. అందమైన బీచ్‌లు ఇక్కడ ఉన్నాయి. స్వచ్ఛమైన నీళ్ళు, రకరకాల జలచరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుండి అనేక రకాల ఆహార ధాన్యాలు ఇక్కడి నుండి ఎగుమతి అవుతాయి. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం హజ్‌యాత్రకు వెళ్ళే వారికి ఈ పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడే పెట్రోలియం శుద్ధి కేంద్రం ఉంది. ఇక్కడి నుండి పెట్రోలియం ఉత్పత్తులు నేరుగా రాజధాని ఖార్టూమ్ చేరడానికి పైపులైను నిర్మించబడింది. ఇక్కడ వాతావరణం అంతా దాదాపు ఎడారి వాతావరణాన్ని పోలి ఉంటుంది. అయితే సముద్రంలో ఈత కొట్టడానికి, స్కూబా డ్రెవింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఎర్ర సముద్రాన్ని చూడడానికి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
 
మృతనగరం-మెరోవే
మెరోవే నగరం ఇసుక కొండలకు ప్రసిద్ధి. పూర్వకాలంలో ఈ ప్రాంతంలోనే విశాలమైన శ్మశానం ఉండేది. దానితో ఇప్పుడు ఈ నగరానికి మృత నగరంగా పేరు వచ్చింది. ఈ నగరం రాజధాని ఖార్టూమ్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే అమున్ దేవాలయం ఉంది. అలాగే పిరమిడ్ల ఎన్‌క్లోజర్ ఉంది. నైలునది మీద నిర్మించిన గొప్ప బ్రిడ్జి ఒక పెద్ద ఆకర్షణ. వేలసంఖ్యలో పర్యాటకులు ఈ బ్రిడ్జిని చూడడానికి వస్తుంటారు. ఇక్కడ  ఇసుక కొండలతోబాటు పిరమిడ్లు కూడా ఉన్నాయి. పిరమిడ్‌లను చూడాలంటే ఈ మెరోవె ప్రాంతానికి తప్పక రావాల్సిందే.

మరిన్ని వార్తలు