ఏడుకొండలవాడికి ఏ నైవేద్యం... ఎప్పుడు? ఎలా?

18 Feb, 2018 01:29 IST|Sakshi

తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగలి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక పలహారం! రుతువులను బట్టి ఆహారం! సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదం వండేవారు వంట సమయంలోనూ, తర్వాతా వాసన సోకకుండా ముక్కుకు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. స్వామికి సమర్పించేదాకా బయటి వారెవరూ దాన్ని చూడరాదు.

నైవేద్యం పెట్టేది ఇలా...
ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు.
గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు.
స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు.
విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి దళాలను అభికరిస్తారు.  
కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడిచేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు.
చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే.
ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని సమర్పిస్తారు.
నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.
రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు.
ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం  
పది, పదకొండు గంటల మధ్య రాజభోగం
రాత్రి ఏడు – ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.
తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తుకు  అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు.
నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు.
ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు.

ఉదయం బాలభోగం
మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, రవ్వ కేసరి
మధ్యాహ్నం రాజభోగం
శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం
రాత్రి శయనభోగం
మరీచ్య అన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం (వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

అల్పాహారాలు
లడ్డు, వడ, అప్పం, దోసె.. స్వామి పలహారాల జాబితా ఇదీ...
 ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని ఆవుపాలు సమర్పిస్తారు
తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు
 ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది
అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది
సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు
 అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు!
అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గుడాన్నం) పెడతారు.
 ఇక పవళించే సమయం దగ్గర పడుతుంది. 
ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

మరిన్ని వార్తలు