ఆర్ట్ ఫర్ గాళ్

14 Mar, 2015 00:57 IST|Sakshi

 కళ... కనువిందు చేసేదే కాదు, కష్టాలను, ఆవేదనను కళ్లకు కట్టేది. కట్టుబాట్లపై ధిక్కారస్వరం. వివక్ష పై ప్రశ్నలను సంధించే బాణ్ బంజారాహిల్స్ గోతెజంత్రమ్‌లోని  ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో ‘బార్న్ ఎ గాళ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఇన్‌స్టాలేషన్స్ వీటన్నింటినీ ప్రతిబింబిస్తున్నాయి.15 మంది హైదరాబాదీ ఆర్టిస్టులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అమ్మాయిపై వివక్ష వద్దు అని సందేశమిస్తోంది.
 ఆడపిల్ల... కడుపులో ఉన్నప్పుడే భ్రూణ హత్యలు. ఆ గండం దాటుకుని బయటికొచ్చినా... అడుగడుగునా వివక్ష. అబ్బాయికి సకల సౌకర్యాలు కల్పించే పేరెంట్స్... అమ్మాయి విషయంలో కాస్త తటపటాయిస్తుంటారు.

కానీ.. ఆడమగను సమానంగా చూసినప్పుడే సమాజం అభివృద్ధి బాటన పడుతుందంటున్నారు హైదరాబాదీ ఆర్టిస్టులు. కడుపులో పిండంగా ఉన్నప్పటి నుంచి కాటికి పోయే వరకు అమ్మాయిలు అడుగడుగునా ఎదుర్కొనే వివక్షను ఇన్‌స్టాలేషన్స్ ద్వారా ఎత్తిచూపారు. శుక్రవారం మొదలైన ఈ ‘ఆర్ట్ ఫర్ చేంజ్’ షో ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఒక్కో ఆర్టిస్టుది ఒక్కో ఇతివృత్తం. ప్రధానంగా విద్యలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం, బాల్య వివాహాలు, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపడం, హెచ్‌ఐవీ, ట్రాఫికింగ్... వంటి సామాజికాంశాలను సృజనాత్మకంగా, విభిన్నంగా కళ్లముందుంచారు.
 ప్రేమతోనే...
 ‘కడుపులో ఉన్నప్పుడు పాప అని తెలియగానే అందరి ఫీలింగ్ ఎలా ఉంటుందనేది చెప్పేందుకు ప్రయత్నించా. మట్టితో ప్రెగ్నెంట్ ఉమెన్‌కు రూపమిచ్చా. గర్భంపైన భారీ రాళ్లను తాళ్లతో వేలాడదీశా. ఆడపిల్ల అని తెలియగానే ఏదో బరువును మోస్తున్నట్టు, టెన్షన్‌గా ఫీలవుతారు... ఈ రాళ్లను బరువు, టెన్షన్, సైకలాజికల్, ఎమోషన్‌కు గుర్తుగా ఉపయోగించా. రోస్‌పెటల్స్ వస్తున్నట్టు చెర్రీస్‌ను తీసుకున్నా. మనం ఆడపిల్లకు ప్రేమతోనే జన్మనివ్వాలి. ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా... ఇద్దరికీ సమానంగా ఎడ్యుకేషన్ అందిస్తే చాలు. వారి బతుకు వారే బతుకుతారు. ఆడపిల్లలను హింసకు గురిచేసే అర్హత మనకు లేదు’ అనే థీమ్‌ను ఎంచుకున్నానంటున్నారు ఆర్టిస్టు అవనిరావ్.
 కన్నీటికి కొత్త అర్థం...
 ‘భ్రూణహత్యలు ఆపాలన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నా’ అంటున్నారు ఆర్టిస్టు గ్లోవర్‌పాల్. అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆడుకుంటున్న దృశ్యాలను 13 ఫీట్‌ల క్లాత్ మీద ఆవిష్కరించారు. భ్రూణహత్యలు, అబార్షన్ చేసే ఇన్‌స్ట్రుమెంట్‌కు సైకతశిల్ప రూపమిచ్చారు. ఇక మట్టితోనే ఉమెన్‌ను ఫామ్ చేసి, వాటర్ పంప్‌తో నిరంతరాయంగా ఆ మహిళ కంటి నుంచి నీటిబొట్టు కారేలా ఏర్పాటు చేసిన ఆర్టిస్టు అప్పలనాయుడు, మహిళ కన్నీటికి కొత్త రూపమిచ్చారు. షో అయిపోయేనాటికి మట్టి అంతా కరిగిపోతుంది. మహిళ జీవితం కూడా అలా కరిగిపోతోందని స్ఫురించేలా ఆయన ఏర్పాటు చేసిన ఇన్‌స్టాలేషన్ ఆహూతుల మనసులను కదిలిస్తోంది.
 ఆట వస్తువు కాదు..
 అబార్షన్ చేశాక వచ్చే ఫ్లాష్‌ను ముద్ద చేసి నాలుగైదు కవర్లలో ఇన్‌స్టాల్ చేసి, పసుపుతో గర్భయంత్రం చేశారు మరో ఆర్టిస్టు పీసీ ప్రసాద్. ప్లాస్టిక్‌ను వాడి వదిలేస్తారు. అలాగే ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నారు. ఒకవేళ దారితప్పి భూమిమీద పడ్డా ఓ ఆటవస్తువులా వాడి వదిలేస్తున్నారని చెప్పడానికే ప్లాస్టిక్‌ను ఉపయోగించానంటున్నారాయన.
 

మరిన్ని వార్తలు