యవ్వనంలోనే వార్ధక్యం

22 Sep, 2014 01:09 IST|Sakshi
యవ్వనంలోనే వార్ధక్యం

డాక్టర్స్ కాలమ్
చెట్టునుంచి పండు వేరు పడగానే కొంతసేపు బాగానే ఉంటుంది. సమయం గడిచే కొద్దీ పండులో ముడతలు వస్తూంటాయి. దీనికి కారణం తేమ శాతం తగ్గిపోతూంటుంది. మనిషిలో కూడా అంతే. శరీరానికి గాలి ఎంత ముఖ్యమో నీరూ అంతే ముఖ్యం. తేమ తగ్గిపోతూంటే చర్మంపై ముడతల పడతాయి. యుక్త వయస్సులోనే వార్ధక్యం వస్తుంది. ఇలాంటి సమస్యలకు నగరం వేదికవుతోంది. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం మనిషిని ముప్ఫై ఏళ్లకే ముసలితనంలోకి నెట్టేస్తున్నాయి.

దీనికి తోడు పనికొచ్చే తిండి తినకపోవడంతో నిండు యవ్వనులు కూడా కాలుష్యానికి అలసిపోయి ముసలితనాన్ని స్వీకరిస్తున్నారు. రకరకాల చర్మవ్యాధులకూ గురవుతున్నారు. మారిన జీవన పరిస్థితులే దీనికి కారణమంటున్నారు ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డా.కిరణ్‌కుమార్. కాసింత జాగ్రత్తలు పాటిస్తే వార్ధక్యాన్ని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు ఆయన.
 
చర్మసమస్యలకు ఇవే కారణాలు
అపరిమిత వాయు కాలుష్యం పలు రకాల చర్మవ్యాధులకు కారణమవుతోంది
ముఖ్యంగా చర్మం ముడతలు రావడానికి, బట్టతల రావడానికి హేతువు
కాలుష్యం ప్రభావం ఒంటినిండా మచ్చలు రావడానికి దోహదపడుతోంది
చాలామంది ముప్ఫై ఏళ్లకే వెంట్రుకలు కోల్పోతున్నారు
రకరకాల చర్మ సమస్యలు ఎక్కువగా 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపువారే ఎదుర్కొంటున్నారు
చాలామంది ఆఫీసులో ఏసీ గదుల్లో పనిచేస్తారు.. బయటికొస్తే ఎండలో తిరగాలి. ఒక్కసారిగా రెండు రకాల
 వాతావరణాలకు హార్మోన్లు తట్టుకోలేక పోతున్నాయి. దీంతో ఎక్కువ మంది చర్మ సమస్యలు ఎదుర్కుంటున్నారు
పోషకాహారానికి దూరం కావడం వల్ల చర్మకాంతికి అవసరమైనవి దక్కకుండా పోతున్నాయి.
చాలామందికి సమయానికి నిద్ర ఉండదు. నైట్ డ్యూటీలు చేస్తారు. పగలంతా నిద్రపోతారు. దీంతో పలు రకాల
 సమస్యలు వస్తున్నాయి.
పైన పేర్కొన్న చాలా సమస్యలు వార్ధక్యానికి (ఎర్లీ ఏజింగ్) దారి తీస్తున్నాయి.
చాలా మంది యువతీ యువకుల ముఖాలు
 కళావిహీనంగా తయారవుతున్నాయి
 
యవ్వనం జాగ్రత్తలు
సమయానికి నిద్ర, సమయానికి తిండి అనేది చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది
కాలుష్యం బారినుంచి కొద్దిగా అయినా ఉపశమనం పొందాలంటే బయట తిరిగే సమయంలో ముఖానికి, తలకు కాస్త స్కార్ఫ్ తదితర దుస్తులు వాడటం మంచిది
వీలైనన్ని నీళ్లు తాగడం ద్వారా చర్మ సంరక్షణను పెంపొందించుకోవచ్చు
ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల చర్మం వర్ఛస్సు బావుంటుంది
వీలైనంతగా ఏ సీజన్‌లో లభించే పండ్లు ఆ సీజన్‌లో తింటే వార్ధక్యం నుంచి బయటపడవచ్చు.
వీలైనంత వరకూ జంక్‌ఫుడ్‌ను తగ్గించి ఆకుకూరలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి.
నిల్వ ఉన్న ఆహారం తినకపోవడం మంచిది. బేకరీ ఫుడ్స్ తరచూ తినడం మంచిది కాదు
ఒకే ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లో పనిచేయడం వలన చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
 
 డా.కిరణ్‌కుమార్ చర్మవ్యాధి నిపుణుడు, ఈషా హాస్పిటల్ సోమాజిగూడ

మరిన్ని వార్తలు