వైఫల్యాలనూ గుర్తుంచుకోవాలి..

26 Mar, 2018 09:05 IST|Sakshi

లండన్‌ : గతంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిణామాలు, వైఫల్యాలను గుర్తుచేసుకుని నిరుత్సాహపడటం సరైంది కాదని అందరూ చెబుతున్న మాటే. అయితే గత వైఫల్యాలను విశ్లేషించుకుని, ఎదురుదెబ్బలను తరచిచూసుకుంటే భవిష్యత్‌లో ఎదురయ్యే ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. ప్రతికూల పరిణామాలను మెరుగ్గా విశ్లేషించుకునే వారు ఒత్తిడిని సమర్ధంగా ఎదుర్కొంటారని, విద్యా, క్రీడలు వంటి పలు రంగాల్లో మెరుగైన సామర్థ్యం కనబరుస్తారని రజెర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.

తీవ్రమైన ఒత్తిడి వ్యక్తుల సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని..అయితే గతంలో ఎదురైన వైఫల్యాల వంటి ప్రతికూల పరిణామాలను తలుచుకుని, వాటి గురించి వివరంగా రాసుకుంటే మనో నిబ్బరం పెరుగుతుందని ముఖ్యంగా శ్రద్ధతో చేయాల్సిన పనుల్లో సామర్థ్యం మెరుగవుతుందని అథ్యయనం నిర్వహించిన రజెర్స్‌ వర్సిటీ పరిశోధకులు బ్రైన్‌ డిమెనిచి వెల్లడించారు. గత వైఫల్యాలను నిక్షిప్తం చేసుకుంటే అవి భవిష్యత్‌లో ఒత్తిడిని ఎంత మేర తగ్గిస్తాయని 86 మందిని పరీక్షించి ఫలితాలను విశ్లేషించారు. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, డ్యూక్‌ యూనివర్సిటీ రీసెర్చర్ల సహకారంతో డిమెనిచి ఈ కసరత్తు సాగించారు. 

మరిన్ని వార్తలు