బకాసురుడి ఆత్మకథ

9 Oct, 2016 02:25 IST|Sakshi
బకాసురుడి ఆత్మకథ

ఉగాది కథల పోటీలో ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ ‘‘ఆఖరి చెట్టుని కూడా కొట్టేసిన తర్వాత... చిట్టచివరి చేపని కూడా పట్టేసాక... తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేసాక... అప్పుడు గుర్తిస్తావు నువ్వు, డబ్బుని తినలేవని..!’’
 - ఆదిమ రెడ్ ఇండియన్ల సామెత
 
తెల్లకాగితాలపై తీక్షణంగా, తదేకంగా రాసుకుంటోపోతున్న దివ్య వాట్సప్ మెసేజ్ టోన్‌కి తలెత్తి, ఫోన్ వైపు చూసింది. ‘అవినాష్’ పేరు చూడగానే, ముఖంపై చిరునవ్వు! పిన్ని కొడుకతడు. ఏవేవో మెసేజెస్ వస్తూంటాయి తన నుంచి. తమాషావీ... ఆలోచింపజేసేవీ... అన్నీ! ఆ రెడ్ ఇండియన్ల సామెత యథాలాపంగా చూసి, పెట్టేస్తూండగా ఫోన్ వచ్చింది. ‘‘అక్కా! రావచ్చా? ఖాళీయేనా?’’
 ‘‘రావచ్చు. ఖాళీయే’’ సంతోషంగా చెప్పిందామె. నిజానికి ఆమె చాలా పనిలో ఉంది, ఒక సీరియల్ రాతలో. కానీ, అతడి కన్నా, ఈ పని ఎక్కువేమీ కాదు. అతడు వస్తూనే, ‘‘... ఏంటీ! ఏవో ప్రేతాత్మల కథలు రాసుకుంటూ చాలా బిజీగా ఉన్నట్లున్నావే...’’ అన్నాడు.
 
చిన్నబుచ్చుకుందామె. మరి తాను కాస్తంత పేరున్న రచయిత్రి, నూరు కథలపైనే రాసింది. అలతి పదాలతో, హృద్యంగా రాస్తుందనే పేరూ ఉంది.
 ‘‘అబ్బ. కాదురా! ఆత్మకథ. ఇదుగో ఈయనది’’ అంటో, తన సీరియల్ వస్తున్న వారపత్రికలో ఒక పారిశ్రామికవేత్త ఫొటో చూపింది.
 ‘అందరి వాడివయ్యా..జానకి రామయ్యా!’ అన్న టైటిల్ చూసి, ‘‘కవిత్వం పరవళ్లు తొక్కుతోందక్కా. బావగారి భావావేశం లాగుందే’’ అన్నాడు.

అది నిజమే. జయరాజ్ సూచించిన టైటిలే అది. అదే చెప్పబోయి, అంతలోనే అతడి వ్యంగ్యం గ్రహించి, ‘‘ఏంటీ సంగతి? సూటిగా చెప్పు సుత్తి లేకుండా’’ అందామె కోపం నటిస్తూ. ‘‘ఏం లేదక్కా. నేనూ నీలాగే కిరాయి రచయితలాగ, పెద్దోళ్ల ప్రేతాత్మ కథలూ అవీ రాసి సంపాదించుకోవాలనుకుంటున్నాను.’’
 ఈసారి నిజంగానే కోపం వచ్చింది ఆమెకి. ‘‘అవీ! ఏమిటా అర్థం లేని వాగుడు?’’
 అవినాష్ వదనం గంభీరంగా అయింది.
 ‘‘అక్కా! ఇది రాసినందుకు ఎంత ముడుతుంది?’’
 ‘‘అవీ! డబ్బుకోసం రాస్తున్నానని

ఎందుకనుకుంటున్నావు? బావగారితో ఆయనకున్న పరిచయాన్ని పురస్కరించుకుని రాస్తున్నాను. ఇక ఆయన నువ్వు అనుకున్నంత చెడ్డవాడేం కాదు. తన సేవా కార్యక్రమాలు, గుప్త దానాలు, సామాజిక సేవ, సాంస్కృతిక సేవ... ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, నీ దృక్కోణం తప్పకుండా మారుతుంది’’ హెచ్చు స్వరంతో చెప్పిందామె.
 అతడు జవాబివ్వకపోవడం చూసి, ‘‘అయినా, కథల కన్నా ఇలాంటి వాస్తవాలకి సజీవ రూపం కల్పించి రాయడం, ఆసక్తిగా చదివింపజేయడం ఎంత కష్టమో నీకేం తెల్సు?’’ అన్నది.
 
ఈసారి అతడు చిన్నగా నవ్వాడు. ‘‘జీవిత చరిత్రలపైన పుస్తకాలు రాయడమంటే ఏమిటి?వారి నిజ స్వరూపాలకి ముస్తాబులు చేసి, వికారాలకి ముసుగులు వేసి, నగిషీలు చెక్కి ‘సుమారు మనుష్యులని’ సుందరంగానూ, మహావ్యక్తులు గానూ చూపడమన్నమాట. అందుకే ఆ ప్రక్రియ కష్టమే మరి!’’
 దివ్య కూడా నవ్వడానికి ప్రయత్నించింది. ‘‘... అవీ! ఆయన్నేమీ మహావ్యక్తిగా మలచడం లేదు. అతి సాధారణ స్థాయి నుండి, ఈనాడు పేరు మోసిన పారిశ్రామికవేత్తగా ఎదగడంలోని కృషిని నేను వెలుగులోకి తెస్తున్నాను అంతే! ఈనాటి తరం వ్యక్తిత్వ వికాస సాహిత్యం విరివిగా చదువుతోంది కదా. ఇది కూడా అలానే అనుకోరాదు పోనీ.’’
 
వారిద్దరికీ వాదోపవాదాలు కొత్తేమీ కాదు. కానీ, ఈ సందర్భం తన విలువలనే నిలదీస్తూండటంతో... ఇబ్బందిగా, ఉక్కపోతగా అన్పించింది ఆమెకి.
 అక్క హావభావాలు గమనించి, అతడు టాపిక్ మార్చాడు. తను పని చేస్తున్న ఆఫీస్‌లోని అధికారుల విషయాలు చెప్పసాగాడు.
 ‘‘ఎవరన్నా, ఎక్కడన్నా అధికారం ప్రదర్శించాలని చూస్తే, తిరగబడాలని చాలా మంటగా ఉంటుంది’’ అన్నాడతడు.
 ‘నీ విషయం తెల్సు కదా’ అన్నట్లు ఆమె మందహాసం చేయడంతో, ‘‘... అవునూ, నువ్వు ఈ అధికార దర్పం, పెత్తనం, హోదాల పట్ల లాలస... వీటిపైన ఎందుకు కథలు రాయకూడదు?’’ అని ప్రశ్నించాడు అతడు.
 
‘‘రాస్తాలే కానీ, నువ్వే ఆఫీసర్‌వి అయితే, నీ కిందివారితో ఎలా ప్రవర్తిస్తావు? చెప్పు ముందు.’’
 ‘‘నేను ఏవయితే అసహ్యించుకుంటున్నానో, ఖచ్చితంగా వాటికి విరుద్ధంగా, సంస్కారంగానే ప్రవర్తిస్తాను. శ్రామిక దృక్పథంతోనే ఉంటాను.’’  దివ్య నవ్వి అన్నది. ‘‘అవినాష్! అది జరగని పని. ఏదో పైపై ఉపశమనాలు చేయగలవేమో గానీ, శ్రామిక దృక్పథం అంటూ మాట్లాడితే నీ ఉద్యోగమే పోతుంది.’’
 ఆ మాటలతో అవినాష్ గాయపడ్డట్టు కన్పించాడు. కొద్దిసేపు ఊరుకుని, తర్వాత అడిగాడు. ‘‘నువ్వు చెప్పింది నిజమక్కా. మరి నీ విషయానికొస్తే... అలాంటి భయాలే అక్కర్లేని నువ్వు, నీ విశ్లేషణకి కొంత మానవీయతని, ధర్మాగ్రహాన్ని సరైన చోట ఎందుకు జోడించవు?’’
 అర్థం కానట్టు చూసిందామె.

అప్పుడు మాట్లాడాడు అవినాష్, మాటలు పేర్చుకుంటో. ‘‘ప్రజల నుంచి భూమి చౌకగా కాజేసి, తర్వాత వాటిని తన ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకి కట్టబెట్టించుకున్నవారి సంగతి తెల్సా నీకు? తమ జీవనాధారమైన పచ్చటి పంట పొలాలు బూడిదగా మారిపోతాయన్న వాస్తవం తెల్సుకుని, నిరసన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపినప్పుడు కొందరు చనిపోయారనీ, చాలామంది క్షతగాత్రులయ్యారనే విషయం తెల్సా? ఉత్తుత్తి ఉపాధి హామీలతో వారి బతుకుల్ని కకావికలం చేశారనీ తెల్సా?’’
 
అవినాష్ భావోద్రేకం ఆమెని నివ్వెరపాటుకి గురిచేసింది. ఆ మాటలు నిప్పు కణికల్లా, దగ్ధ గీతల్లా ఉన్నాయి. ఫెటేల్మంటూ ఉరిమేటప్పుడు, మెరిసిన కాంతిలో దృశ్యాలు స్పష్టాస్పష్టంగా ఉన్నట్లు... వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూండగానే, ఉద్విగ్నం కంఠం సవరించుకుని మళ్లీ చెప్పసాగాడతడు.
 ‘‘రాజకీయ నాయకులంటే ప్రజలకి అసహ్యమే గాని, వారి వెనుక ఉండి లోపాయికారిగా ధ్వంస రచన చేయించేవారిపైన అంతగా కోపం ఉండదు. కారణం వారి గురించి తెలీకపోవడం.

వారు రాజకీయపు రొచ్చు అంటించుకోకుండా, తెలివిగా కళాసేవ, సాంస్కృతిక సేవల్లాంటి తొడుగులు కూడా వేసుకుంటారు. వాటిని చూసి, నీలాంటి వారు సైతం ముగ్ధులవుతుంటారు.’’
 ‘‘ఒకప్పుడు ఆఫ్రికాని మైనింగ్ కంపెనీలు లూటీ చేసి, ఇప్పుడున్న దీనస్థితికి ఎలా దిగజార్చాయో, అలా రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులో అరాచకానికి పాల్పడుతున్నవారిలో ముఖ్యుడు... ఈ జానకి రాముడు.’’
   
జయరాజ్ ‘కవి కూడలి’ నుంచి బయటపడేసరికి, రాత్రి పదకొండు దాటింది. ‘కవి కూడలి’ అనేది... కవులు, వారి శిష్యులు, ప్రశిష్యులు ఒక కాకా హోటల్ దగ్గర పెట్టుకున్న సంగమ స్థానం. వారిని కలిపేది కవిత్వాభిరుచి కాదు, పక్కనున్న బార్ తాలూకు బ్రాందీ రుచి అంటారు గిట్టనివారు.
 దారిలో ఉండగా, ‘పెద్దాయన’ నుండి ఫోన్ వచ్చింది. ఆత్మకథ ఆయన పుట్టినరోజు నాటికి పూర్తి చేయించి ఇచ్చేస్తాననీ, ఆవిష్కరణ సభ ఘనంగా చేసుకోవచ్చనీ, వాగ్దానం చేసి ఫోన్ పెట్టేశాడు. అతడు ఒకప్పుడు అభ్యుదయ కవిగా పేరుమోసినవాడు.

ఇప్పుడు పెద్దవారి వెచ్చటి కరస్పర్శలో తన్మయత్వం అనుభవిస్తున్నాడు. దానికి ప్రతిఫలం మరోచోట తప్పకుండా, ఏ కాంట్రాక్టుల రూపంలోనో భారీగా ముడుతూంటుందని అతడికి తెల్సు.
 ఇంట్లో ఎప్పటిలాగా చదువుకుంటూనో, రాసుకుంటూనో ఉండే దివ్య, మౌనంగా చీకట్లో కూర్చోవడం, పిల్చినా పలక్కపోవడం చూసి, కీడు శంకించాడు అతడు. అప్పటివరకూ రాసిన కాగితాలు ముక్కలుగా డస్ట్‌బిన్‌లో పడుండటం చూసి, అదిరిపడ్డాడు. ఒక్కసారిగా వెయ్యి సందేహాలూ, వెయ్యి ఆలోచనల్తో కిక్కిరిసిపోయింది అతడి మెదడు. ఎప్పటికో తేరుకొని, ‘‘ఆ వెర్రి బాగులోడు గానీ వచ్చాడా?’’ అని ప్రశ్నించాడు. దివ్య చురుగ్గా చూసింది అతడివైపు.
 
ఆ సాయంత్రం అవినాష్ వెళ్లిపోయాక, యూట్యూబ్‌లో ‘కోస్ట్ అండర్ ఎటాక్’ అనే డాక్యుమెంటరీ చూశాక, అందులోని వ్యధార్థ దృశ్యాలకు కంపించిపోయిందామె. పారిశ్రామిక వ్యర్థాలు కలిపిన వాగు నీటిని, తెలీక దప్పిక తీర్చుకున్న పల్లెమనిషికి మాట పడిపోవడం చూసి, ఆమెకి మాట రాలేదు. ఇంకా...గాలిలో, నీటిలో విష పదార్థాల చేత ఇరవయ్యేళ్ల వాళ్లు అరవయ్యేళ్ల వృద్ధాప్యంలోకి రూపాంతరం చెందడం చూసింది. స్త్రీలు గర్భాలు పోగొట్టుకోవడం నుంచి, పిల్లలు మానసిక వైకల్యాలకు గురికావడం చూసింది.

ఉపాధి లేక, నిర్వాసితుల్లాగ తమ సొంత ప్రాంతంలోనే అపరిచితుల్లాగ ఉండటం చూసింది. ఉన్నదాంతోనే ఎలాగోలా ప్రశాంతంగా బతికేస్తున్నవారి బతుకుల్లో యుద్ధ బీభత్సం లాంటిది విషాదంగా గమనించింది. ఇక్కడి బాధిత రైతులు, కూలీలు, మత్స్యకారులు, ఆదివాసీలు... ఒకప్పుడు అమెరికన్స్ చేత తరమబడ్డ ఆదిమ రెడ్ ఇండియన్స్ మాదిరి అన్పించారు. మరి తానేం చేస్తోంది? రాష్ట్రంలో నాల్గోవంతు ప్రజలకి ఈ దుస్థితి కలగడానికి కారణమైన  సూత్రధారి ఆత్మకథని గ్లోరిఫై చేస్తో రాస్తోంది. సుడులు తిరిగిన బాధతో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. జయరాజ్ ఎన్నో వాదనలు చేశాడు, ఎంతో కన్విన్స్ చేయబోయాడు. కానీ, ఆమె ముందు తనో మరుగుజ్జులా మారిపోతున్నాననే విషయం అతడికి తెలియరాలేదు. ఆమె అతడికి ఒక్కమాట కూడా బదులివ్వలేదు. ఇన్నాళ్లూ తననీ ఒక స్తబ్దతకీ, స్పందనా రాహిత్యానికి లోను చేసినందుకు అది నిరసన కావచ్చు.
   
వారం రోజులు గడిచాయి. అనివార్య కారణాల వల్ల, ఆత్మకథని ప్రచురించలేకపోతున్నామనే ప్రకటన వారపత్రికలో చదివాక, అవినాష్ ఉప్పొంగిపోయాడు. తాను సాధించిన చిన్న విజయంగా దాన్ని భావించాడు. ఆఫీస్‌కి వచ్చాక, దివ్యకు ఫోన్ చేయాలనుకుంటూనే, మళ్లీ వాయిదా వేసి వచ్చి, సీట్లో కూచున్నాడు.
 కాస్సేపయ్యాక, ఒక సన్నటి వ్యక్తి వచ్చి, అతని సీట్ పక్కన నిల్చుని, విష్ చేశాడు. అతడ్ని గుర్తుపట్టాడు అవినాష్. ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న అతడు డివిజనల్ ట్రాన్స్‌ఫర్‌కి అప్లయ్ చేసుకున్నాడు.

ఎందుకనో అతడు కొంచెం నెర్వస్‌గా ఉండటం గమనించినా, పట్టించుకోకుండా ‘‘బిజీగా ఉండటం వల్ల, కుదర్లేదు. మీ కేసు ఇవ్వాళ చూస్తాను’’ అని చెప్పాడు అవినాష్. ‘‘కాస్త త్వరగా ఫార్వర్డ్ చేసి, పనయ్యేట్టు చూడండి సార్’’ అన్నాడు ఆ వ్యక్తి. అలా అంటూనే, ఊహించని విధంగా, అవినాష్ జేబులో చిన్న నోట్ల కట్ట ఒకటి పెట్టేసి, దూరం జరిగాడు. అవాక్కయిన అవినాష్, ‘ఏమిటిది?’ అంటో కంగారుగా లేచి, అది తిరిగి అతని చేతిలో పెట్టబోయాడు. కానీ, ఆ పని పూర్తి చేయకముందే, బలిష్టంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి, కదలకుండా పట్టుకున్నారు.

అందులో ఓ వ్యక్తి ‘ఐడి’ చూపిస్తో, ‘విజిలెన్స్’ అన్నాడు కరుగ్గా. దిమ్మెరపోయి, అవినాష్‌కి మెల్లగా పరిస్థితి అర్థమైంది. మొదట డబ్బు ఇవ్వజూపిన వ్యక్తిని పరికించి చూశాడు.
 తనని ట్రాప్ చేయడానికి ఎరగా వాడబడ్డ వ్యక్తి అతడు! పట్టించుకోలేదు. స్టేట్‌మెంట్లూ, సంతకాలూ అన్నీ చకచకా పూర్తి అయ్యాయి. నిజం ఏమిటో తెలుస్తూనే ఉన్నా గుసగుసలే తప్ప, ఎవరూ బయటికి మాట్లాడే సాహసం చేయలేదు. సీనియర్ పర్సనల్ ఆఫీసర్ అతని సస్పెన్షన్ ఆర్డర్ అందిస్తూ, ‘‘సారీ మ్యాన్. ట్రాప్ కేసులో ఇరుక్కున్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని రూల్ చెబుతోంది’’ అన్నాడు.
 
అతడి కంఠంలో ఏదో హేళన, శాడిజం గమనించి, మౌనంగా తలపంకించి, బయటికి వచ్చేశాడు అవినాష్. క్యాంటీన్‌లో కూచున్న అతడ్ని ప్రతిమ పలకరించింది. తనూ అక్కడే వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. రోజుకి రెండూ మూడు తెలుగింగ్లీషు పుస్తకాలు ఇడ్లీ వడల్లాగ ఆకలితో లాగించేస్తూంటుంది ఆ అమ్మాయి. అంతేకాదు, వాటిపైన అనర్గళంగా బ్లాగుల్లో సమీక్షలు రాసేస్తూంటుంది. వాటిలో ఉత్త భావోద్వేగాలే తప్ప, లోతైన అవగాహన లేదని అతడి అభిప్రాయం.  
   
మర్నాడు దివ్య, అవినాష్‌కి ఫోన్ చేసింది. ఆ సీరియల్ ఆపేయడం గూర్చి సంతోషం వ్యక్తపరిచి, అభినందించాడు అతడు. ‘అది తర్వాత. ముందు నీ ఉద్యోగం సంగతి చెప్పు’’ అందామె క్లుప్తంగా. అతడు తేలిగ్గా నవ్వేసి, ‘‘డోంట్ వర్రీ. అదో ఫాల్స్ కేసు. దాని సంగతి నేను చూసుకుంటాను’’ అన్నాడు. ఆమె కుదుటపడలేదు. అతను ఉద్యోగం చేస్తాడని మొదట్లో ఎవరూ అనుకోలేదు. అలా ఉండేది అతని ధోరణి. దివ్య నచ్చచెప్పాకే, ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. తర్వాత ఎన్ని ఇంటర్వ్యూలు ఎదుర్కొని, ఈ ఉద్యోగం సంపాదించింది ఆమెకి తెల్సు.

అలాంటిది, అతడు ఈ సమస్యని తేలిగ్గా తీసుకోవడం, ఆమెకి నచ్చలేదు. ఆమె ఆలోచనల్లో ఉండగానే, ప్రతిమ నుండి ఫోన్ వచ్చింది. అవినాష్ మీద బనాయించబడ్డ కేసుకీ, తమ ఆఫీసర్‌కీ ఏమీ సంబంధం లేదనీ, దీని వెనుక ఇంకెవరో పెద్దవాళ్లున్నారనే అనుమానం ఉందని ప్రతిమ చెప్పగానే, ఒక్కసారి గుండె ఝల్లుమంది ఆమెకి. మనసులో ఏదో అనుమానం. దూరంగా కూర్చుని, టీవీ చూస్తున్న భర్త వంక సాలోచనగా చూసింది.
   
క్యాంటీన్‌లో కూచుని, వారపత్రిక చూస్తున్నాడు అవినాష్. ఆత్మకథా సీరియల్ మళ్లీ మొదలైంది. ఏం జరిగిందో అతడికి అర్థం కాలేదు. అతడు ఆలోచనల్లో ఉండగా, ‘హాయ్ వినాష్’ అన్న ప్రతిమ పిలుపు వినబడింది.
 తన టీజింగ్‌కి బదులివ్వకపోవడంతో, వారపత్రికలోకి తొంగి చూసింది. ‘‘దీన్ని రాయమని, మీ బావగారు నావద్దకొచ్చి అడిగారు. నేను రాయనని, నాకలాంటివి బోర్ అనీ చెప్పాను.’’
 
క్రికెటర్ నితిన్ ఆత్మకథ అయితే రాస్తానని అనకపోయావా?
 అతడి వ్యంగ్యాన్ని పట్టించుకోలేదామె.
 ‘‘అంత అదృష్టం పడితేనా... నితిన్ నామజపంతో మనందరి నోళ్లు ఎండేలా రాయనూ’’ అంది. ఆమె ఒక వాసనలేని ‘కాగిత పువ్వు’లాగ అన్పించింది అతడికి. సమస్యల మూలాలు తెల్సుకోకుండా, పిట్టల మీద, పువ్వుల మీద కోటికొక్కడు, నూటికొక్కడు లాంటి పుస్తకాల రాసుకుంటూ, తర్కం లేని ఎమోషనల్ రిజిడిటీతో విహరించేవాళ్లని ఇంకేమనాలి!
   
చూస్తుండగానే, నెలరోజులు గడిచిపోయాయి. దివ్య మిగిలిన భాగాలు కూడా పూర్తిచేసి ఇచ్చేసింది. ఆమె శ్రద్ధగా రాయలేదనిపించిన చోట్ల జయరాజే తంటాలుపడి రాసుకున్నాడు. తర్వాత దాన్ని భక్తి శ్రద్ధలతో పెద్దాయన చేతుల్లో పెట్టాడు. అదే రోజు అవినాష్ పైనున్న విజిలెన్స్ కేసు కూడా, తూతూ మంత్రపు విచారణతో ఎత్తేయబడింది. అది తెల్సుకున్న దివ్య సంతోషంతో, అవినాష్‌కి ఫోన్ చేసింది. కానీ, అతను ఫోన్ కట్ చేశాడు.

దాంతో, ఆమె ఎంత గాయపడిందంటే, రెండ్రోజుల్దాక మామూలు మనిషి కాలేకపోయింది. అతడ్ని తమ్ముడి కన్నా ఒక ఆత్మబంధువులాగ భావించేది తను. అలాంటిది తను తృణీకారానికి గురవ్వడంతో వేదనకి గురయ్యింది.
 ప్రతిమ తనకు ఫోన్ చేసిన రోజు, ఆమె భర్తని నిలదీసింది అనే కంటే, శివంగిలా విరుచుకుపడిందనటం కరెక్టు. ‘‘నాకేం తెలీదు. అతడి మాటల వల్ల, నువ్వు రాయడం మానుకున్నావని మాత్రమే చెప్పానంతే’’ అని తప్పించుకున్నాడు.
 
‘‘పెద్దవాళ్లతో వ్యవహారం. జాగ్రత్తగా ఉండాలని మొదట్నుంచీ మొత్తుకుంటూనే ఉన్నాను’’ అంటో సన్నాయి నొక్కులు నొక్కుతున్న అతడు... కీర్తి కోసం, కాసుల కోసం జరుగుతున్న పరుగులో చాలా దూరం వెళ్లిపోయాడని గ్రహించిందామె. ముందు తన తక్షణ కర్తవ్యం, అవినాష్‌ని ఈ సమస్యలోంచి బయటికి లాగడం అనుకుని, మళ్లీ ఆత్మకథ రాయడం ప్రారంభించి ముగించింది. అలాంటిది తననే అసహ్యించుకుంటున్నాడు అతడిప్పుడు. నిజం చెప్పేస్తే..? అప్పుడూ హర్షించడు.

‘నువ్వు పిచ్చి పని చేశావు’ అంటో తన మాటని తోసేస్తాడేమో! ‘‘నేను రాయకపోయినా, మరొకరు రాస్తారు కదా, ఏమిటా ప్రయోజనం?’’ అని తాను మొదట్లో అన్నప్పుడు ‘‘మన వైపు నుండి తప్పు జరక్కపోవడం ముఖ్యం గానీ, మనం కాకపోతే మరొకడైనా చేసేస్తాడు కదాని, మనం హత్యలకి కూడా ఒప్పుకుంటామా?’’ అని ప్రశ్నించిన అతడి మాటలు గుర్తొచ్చాయి. అయినా ‘ఇదంతా నీ గురించే చేశాను కాబట్టి, నువ్వు నాతో మళ్లీ ఆప్యాయంగా ఉండాలి’ అని తాను అర్ధించడం ఏమిటి?’ నిర్వేదంగా కళ్లు తుడుచుకుంది ఆమె.
   
‘జానకి రామయ్య’ జన్మదినోత్సవం నాడు, ఆయన ‘ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కూడా జరిగింది. చాలా కాకతాళీయంగా, అదే రోజు సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ప్రకటించారు. ఈసారి అవార్డ్ దివ్యను వరించింది.  భట్రాజులకి సంత్పరణ లాంటిదే తన అవార్డ్ కూడా అని అర్థమయ్యింది. ఆమె అకాడమీ అవార్డ్‌ని తిరస్కరించిందనే వార్త బ్రేకింగ్ న్యూస్ అయింది. సరిగ్గా అప్పుడు, ఆమె ఫోన్‌కి ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. అది అవినాష్ నుండి!
 ‘సార్త్రే తనకి ప్రకటించిన నోబుల్ ప్రైజ్‌ని తిరస్కరిస్తూ ఇలా అన్నాట్ట... నా బూటు లేసంత పాటి కూడా విలువ చేయదు.’
 
అది చూస్తుండగా... అతడి నుండి ఫోన్ వచ్చింది.. ‘‘అవీ!’’ అన్నదామె ఉద్విగ్నంగా, వణికే గొంతుతో. ‘‘క్షమించక్కా. నాకిప్పుడు తెలుస్తోంది... నువ్వు ఆ ఆత్మకథని పూర్తిచేయడానికి, నీ హృదయంలోంచి ఎంత రక్తం ఒలికి వుంటుందో...’’
 ‘‘చాలురా. ఇదీ నాకు నిజమైన అవార్డు...’’ అన్నదామె రుద్ద కంఠంతో. తర్వాత జయరాజ్ నుండి వరుసగా ఫోన్ కాల్స్! ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అవతల పడేసింది. టీవీలో పుస్తకావిష్కరణ సభలో, వంది మాగధుల భజన అసహ్యం వేసి, న్యూస్ ఛానల్ మార్చింది. తమ ప్రాంతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్దంటున్న ప్రజల ఆందోళనపై ఖాకీలు లాఠీలు ఝళిపిస్తున్న దృశ్యాలు వస్తున్నాయి. ఆ హాహాకారాలు తన మనస్సుని వికలం చేసేస్తూండగా, ఆమె అంతశ్చేతన మరింత జాగృతం కాసాగింది.
 ఆ రాత్రి ‘బకాసురుడి ఆత్మకథ’ అనే రచన ప్రారంభించిందామె!
- శివచంద్ర

మరిన్ని వార్తలు