గత పాలనలోనూ బాబు నిర్వాకమిదే

11 Apr, 2019 02:01 IST|Sakshi

విశ్లేషణ

ఇది పదిహేనేళ్ల క్రితం అంటే 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలైనప్పుడు ప్రముఖ బ్రిటిష్‌ పాత్రికేయుడు జార్జ్‌ మాన్‌బియోట్‌ గార్డియన్‌ పత్రికలో రాసిన వ్యాసం. ఈ వ్యాసంలో నాటి చంద్రబాబు పాలనలో జరిగిన అవకతవకలను సవివరంగా పేర్కొన్నారు. చంద్రబాబు పాలనకు స్ఫూర్తినిచ్చిన విజన్‌ 2020 వెనక ఉన్న ప్రమాదాన్ని సాక్షాధార సహితంగా బహిర్గతం చేశారు. జార్జ్‌ మాన్‌బియోట్‌ వ్యాసంలోని ప్రధాన అంశాలు ఇవి...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఓటర్లు 2004లో తమ జీవితాల్లోంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును తోసిపారేయడం ద్వారా ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన ఆర్థిక ప్రయోగాన్ని ధ్వంసం చేసి పడేశారు. చంద్ర బాబు పాశ్చాత్య పాలకులకు అత్యంత అభిమానపాత్రుడైన వ్యక్తి. సొంత ప్రజల అవసరాలను, వ్యథలను పక్కనబెట్టి, తాము చెప్పిందల్లా చేస్తూ వచ్చాడు కాబట్టే చంద్రబాబు అంటే వారికి అంత ఇష్టం మరి. దాంట్లో భాగంగానే బ్రిటిష్‌ ప్రభుత్వం, ప్రపంచబ్యాంకు ఏపీలో నిధులు గుమ్మరిస్తూ వచ్చాయి. ఇలాంటి పాలకుడు ఎక్కడా లేడంటూ పాశ్చాత్య మీడియా కూడా బాబును ఆకాశానికెత్తేసింది. వీరి మద్దతు ఉన్నంతవరకు తాను ఎవరికీ భయపడాల్సిన, లొంగి ఉండాల్సిన అవసరం లేదని బాబు భావించారు. ప్రపంచ ఆధిపత్య శక్తులు కోరిందల్లా ఇస్తున్నంతవరకు తన ప్రభుత్వ ఖజానాకు నిధులు వచ్చిపడుతుంటాయని బాబు నమ్మిక. దేశ రాజకీయాల్లో డబ్బే ముఖ్యం కాబట్టి అదే తనకు స్థాయిని తెచ్చిపెడుతుందని చంద్రబాబు భావన. దీంతోటే తన విధానాలను స్వయంగా రూపొందించుకోవడం మాని ఆ పనిని అమెరికన్‌ కన్సల్టెన్సీ మెకెన్సీకి అప్పగించేశారు. 

మెకెన్సీ రూపొందించినదే అప్రతిష్టాకరమైన విజన్‌ 2020 డాక్యుమెంట్‌. దీని సారాంశం ఒక విషయాన్ని చెబితే దానిలోని అంశాలు మరొకటి చెప్పేవి. ఉదాహరణకు విద్య, ఆరోగ్య సంరక్షణను సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందించాలని ఈ డాక్యుమెంట్‌ నొక్కి చెబుతుంది. కానీ ఏపీలో ఆసుపత్రులను, వైద్య విశ్వవిద్యాలయాలను ప్రయివేటీకరించి యూజర్‌ చార్జీలను ప్రజలనుంచి రాబట్టాలని ఆ తర్వాతి పేజీల్లోనే కనబడుతుంది. చిన్న తరహా వ్యాపార సంస్థలు ఉండాలని ఒకవైపు చెబుతూనే వాటిని నిర్మూలించే చట్టాలను తీసుకురావాలని, చొరవ లేని ‘చిన్న మదుపుదారుల’ స్థానంలో ‘భారీ కార్పోరేషన్ల’ను తీసుకురావాలని మరోవైపు నిస్సిగ్గుగా ప్రకటిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధిని కల్పించాలని చెబుతూనే 2 కోట్ల మందిని సాగు భూములనుంచి వెళ్లగొట్టాలని చెబుతుందది. 

వీటితోపాటు ప్రైవేటీకరణ అమలు, ప్రభుత్వ క్రమబద్ధీకరణ చట్టాలను ఎత్తివేయడం, ప్రభుత్వ పాత్రను కుదించడం వంటి ఇతర అంశాలను కూడా కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను పస్తులతో, ఆకలిదప్పులతో మలమలా మాడ్చేసే విధానాలకు మెకెన్సీ ఒక నమూనాను రూపొందించిందని అర్థమవుతుంది. ఈ నమూనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగుల సంఖ్యను కుదించుకోవాలి. మిగతా శ్రామిక శక్తిని విదేశీ కార్పొరేషన్లు ‘హేతుబద్ధీకరిస్తాయ’న్నమాట. దీని మరో ప్రభావం 2 కోట్లమంది రైతులను భూములనుంచి వెళ్లగొట్టడం. విధానాల్లో ఈ నూతన మార్పుగురించి ఆంధ్ర ప్రజలు అవగాహన పెంచుకోవలసిందేనని మెకెన్సీ సంస్థ హెచ్చరించింది కూడా. అయితే మెకెన్సీ విజన్‌ చంద్రబాబు ప్రభుత్వానికే పరిమితమైనది కాదు. ఒకసారి చంద్రబాబు ఈ విజన్‌ పాలసీలను అమలు చేశాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవకాశాలను అందిపుచ్చుకుంటోందని, ఇతర రాష్ట్రాలను కూడా ఈ సంస్కరణల్లో ప్రభావితం చేసి ఏపీ ఒక నమూనా రాష్ట్రంగా రూపొందుతుందని మెకెన్సీ డాక్యుమెంట్‌ ఊదరగొట్టింది. 

బ్రిటిష్‌ పాలకులు ఈస్టిండియా కంపెనీ ద్వారా నాలుగు శతాబ్దాల క్రితం భారత్‌లో అడుగుపెట్టి దేశాన్ని మొత్తాన్ని వలసగా మార్చుకున్న చరిత్ర తెలిసిందే. వ్యాపారం కోసం కోటలు కట్టుకుంటాం అనుమతి నివ్వండి అని కోరినవారే తదనంతరం భారతీయ రాజ్యాలను, సంస్థానాలను కూల్చివేశారు. తన పెట్టుబడుల రక్షణ కేంద్రంగా భారత్‌ ప్రాధాన్యాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం గుర్తించిన నేపథ్యం లోనే బ్రిటన్‌ పెట్టుబడులకు అవకాశాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా ఏపీలో చంద్రబాబు హయాంలో అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు దీని అర్థమేమిటో తెలుసు. ‘‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ పునరాగమనం’’ అంటూ వారు దీన్ని సరిగ్గానే పిలిచారు. 

బ్రిటిష్‌ దోపిడీ చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పునరావృతం అయిం దని చెప్పడానికి ఇదొక్కటే అంశం కాదు. టోనీ బ్లెయిర్‌ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని చుట్టుముట్టిన కుంభకోణాలకు చంద్రబాబు పాలనకు సంబంధం ఉందన్నది తెలిసిందే. ప్రముఖ కార్‌ రేసింగ్‌ సంస్థ ఫార్ములా వన్‌ యజమాని బెర్నీ ఎక్సెల్‌స్టోన్‌ అప్పట్లోనే లేబర్‌ పార్టీకి పది లక్షల పౌండ్లను సమర్పించుకున్నాడు. ప్రతిఫలంగా తర్వాత టొబాకో ప్రకటనలపై అమలులో ఉన్న నిషేధం నుంచి మినహాయింపు పొందాడు. ఇతడే హైదరాబాద్‌లో ఫార్ములా వన్‌ రేసింగ్‌ను ప్రారంభించే విషయమై చంద్రబాబుతో సంప్రదింపులు జరిపాడు. ఫార్ములా వన్‌ని కీలకమైన విభాగంగా చేసి, హైదరాబాద్‌ను ‘ప్రపంచ స్థాయి ఫ్యూచరిస్టిక్‌ నగరం’గా మార్చాలని, దానికి సహకారం అందించాలని మెకెన్సీ ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌కు సూచించింది కూడా. దీంట్లో భాగంగానే ఏపీ ప్రభుత్వం 400 కోట్లనుంచి 600 కోట్ల రూపాయల మేరకు సహాయం అందించాలని మెకెన్సీ పేర్కొన్నట్లు ఏపీ కేబినెట్‌ సమావేశం మినిట్స్‌ వివరాలు లీక్‌ అయ్యాయి కూడా. అంటే ఫార్ములా వన్‌ కోసం ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం 50 నుంచి 75 మిలియన్‌ పౌండ్లను సబ్సిడీ కింద అందించాల్సి ఉంటుంది. ఇలాంటి విధానాల అమలు కోసం బాబు గతంలోనే ఆహార సబ్సిడీపై కోత విధించిన ప్రతిఫలంగా  రాష్ట్రంలోని వేలాది ప్రజలు పోషకాహార లేమి సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని చెప్పాల్సిన పనిలేదు.

నాటి ఏపీ కేబినెట్‌ సమావేశం మినిట్స్‌ వివరాలు మరింత ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాయి. పొగాకు సంబంధిత ప్రకటనలపై భారతదేశం విధించిన నిషేధాన్ని ఎక్లెస్టోన్‌ ఫార్ములా వన్‌ విషయంలో మినహాయించాలని ఆ మినిట్స్‌ పేర్కొంది. ‘చంద్రబాబు ఇప్పటికే ఈ విషయమై నాటి ప్రధానిని, కేంద్ర ఆరోగ్యమంత్రిని సంప్రదించారు కూడా’ పొగాకు నిషేధ చట్టానికి మినహాయింపు నిస్తూ కేంద్రం చట్ట సవరణ చేస్తుందని బాబు ఆశాభావం వ్యక్తపరిచారని ఆ మినిట్స్‌ తెలిపింది.

పాశ్చాత్య పెట్టుబడులకు ఈ రకంగా తివాచీ పరిచిన కారణంగా కరువుకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వేలాది, లక్షలాదిమంది ప్రజలు ఛారి టీలు అందిస్తున్న గంజినీళ్లు తాగి బతకాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల కొరత కారణంగా 2003లో వందలాది పిల్లలు ఏపీలో మెదడువాపు వ్యాధిబారిన పడి చనిపోయారు. రాష్ట్ర జనాభాలో 77 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువనే జీవిస్తున్నారని స్వయానా ప్రభుత్వ గణాంకాలే తెలిపాయి. ఏరకంగా చూసినా దారిద్య్ర విషయంలో ఇదొక భారీ పెరుగుదల. 1993లో ఏపీ నుంచి ముంబైకి వలస కార్మికులను తీసుకెళ్లడానికి వారానికి ఒక బస్సు మాత్రమే తిరిగేది. 2004 నాటికి వాటి సంఖ్య 34కు పెరిగింది. ఇలా ఉన్నచోట ఉపాధి కోల్పోయిన వారు నూతన దోపిడీ సామ్రాజ్యం తయారు చేసిన కొత్త కూలీలుగా, బానిసలుగా రూపాంతరం చెందారు. కానీ భారత్‌లో ప్రజాస్వామ్యం ఇప్పటికీ పనిచేస్తున్నట్లుంది. 1999లో చంద్రబాబు పార్టీ 29 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. కాంగ్రెస్‌కు అయిదు స్థానాలే మిగిలాయి. కానీ 2004 ఎన్నికల్లో ఫలితాలు సరిగ్గా తలకిందులయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో వలస దోపిడీకి మరోసారి గేట్లు తెరిచిన చంద్రబాబుపట్ల రాష్ట్ర ప్రజలు ఆ ఎన్నికల్లో సరైన తీర్పే చెప్పారు. 

నమ్మక ద్రోహానికి ప్రజాతీర్పే గుణపాఠం
మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్ర దశా, దిశా మార్చివేస్తానని టముకు వాయించుకుని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన పాలకుడు ఇంత నమ్మకద్రోహం చేయవచ్చా? 2019 ఎన్నికల పోలింగ్‌ సమీపించిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మ ఘోష ఇది. అమరావతి ప్రపంచంలో తలమానికమైన రాజధాని అన్నారు. శంకుస్థాపనలకే రూ. 250 కోట్లు ఖర్చుచేసి తర్వాత అడుగు ముందుకు కదపలేదు. అక్కడ బీడుబారిన భూముల సాక్షిగా రైతన్నల కన్నీటి కథలు వినిపిస్తున్నాయి. ఉపాధి లేని కూలీల కడుపుమంట అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. గ్రాఫిక్స్‌ మాయాజాలంలో మోసపోయిన కసి రాజధాని ప్రాంత ప్రజల్లో కనిపిస్తోంది. జాబు రావాలంటే బాబు రావాలి అంటూ చేసిన ప్రకటన వెనుక దాగిన నమ్మకద్రోహం బారినపడి నలిగిన నిరుద్యోగుల మనసులు ఆగ్రహావేశాలను రగిలిస్తున్నాయి. పచ్చటి భూములు పచ్చబాబుల పాలై భూములు అప్పగించేసిన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. 

కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ క్రూరత్వానికి బలైన అమాయకుల ఆక్రందనలు రాష్ట్రంలో ఇంకా మాసిపోలేదు. పోలవరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి పురి విప్పుతూ జాతీయ పర్యవేక్షణ సంస్థలనే కలవరానికి గురిచేస్తోంది. బాబు అయిదేళ్ల పాలనలో రెండున్నర లక్షల ఎకరాల ఆలయ భూములు ఆక్రమించారు, గుడుల్ని మింగారు, గుడిలో లింగాల్ని మింగారు. మాన్యాలు, సత్రం, మఠం భూములను కాజేశారు. ఇసుక అక్రమ విక్రయాలతో కనీవినీ ఎరుగని దోపిడీకి నడుంకట్టారు., ఒక్క రాజధాని ప్రాంతంలోనే 20 వేలమంది కూలీలకు ఉపాధి లేకుండా వీధులపాలు చేశారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను నిర్వీర్యం చేసేశారు, న్యాయం చేయమని అడిగిన వృత్తి జీవులను తాటతీస్తా అంటూ బహిరంగంగా బెదిరించారు. అర్చకుల కనీస హక్కులకూ మంగళం పలికేశారు.  బీసీలనయితే నిలువునా దగా చేసేశారు. డ్వాక్రా మహిళలను ముంచేసింది చాలక పసుపు కుంకుమ పేరిట కొత్త దగాకు సిద్ధమవుతున్నారు. రుణమాఫీ విషయంలో సరికొత్త నాటకాలకు తెర తీస్తున్నారు.

సకల సామాజిక వర్గాలు ఏపీలో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిన చంద్రబాబు తనకు మళ్లీ అధికారం ఇస్తే మరోసారి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నమ్మబలుకుతున్నారు. రాష్ట్రం మొత్తాన్ని అవినీతి సముద్రంగా మార్చిన బాబు గత అయిదేళ్ల పాలనలో తానేం చేశాడో ప్రజ లకు వివరించడం మాని ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై సెంటిమెంటు రెచ్చగొడుతూ మళ్లీ గెలవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ అయిదేళ్లుగా బాబు పాలనలో కడగండ్లను అనుభవించిన ఏపీ ప్రజలు కుల, మత, వర్గ, పార్టీ భేదాలు లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందచేస్తానంటున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిగించిన ఆశాభావాన్ని ఇవాళ మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఆ ప్రజా విశ్వాసమే పునాదిగా ఏపీ కొత్త చరిత్రకు నాంది పలకాలి.(2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర పరాజయం తప్పదని జాతీయ సర్వేలు ఘోషిస్తున్న సందర్భంగా)


వ్యాసకర్త : జార్జ్‌ మాన్‌బియోట్‌, బ్రిటిష్‌ రచయిత, పర్యావరణ, రాజకీయ కార్యకర్త

మరిన్ని వార్తలు