మోదీకి మద్దతు కరుగుతోందా?!

31 Dec, 2017 01:27 IST|Sakshi

అవలోకనం

మనమిప్పుడు 2018లోకి ప్రవేశించబోతున్నాం. ఎన్నికల ముందు సంవత్సరమిది. ఆర్థికరంగంలో మోదీ పనితీరుకు సంబంధించిన డేటా ఆయన విఫలుడని చెబుతోంది. తన పదేళ్ల పాలనాకాలంలో సాధించిన సగటు వార్షిక వృద్ధి రేటుకు సరితూగగల వృద్ధి రేటును మోదీ సాధించలేకపోయారని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎత్తిచూపారు. మోదీని అభిమానించే కార్పొరేట్‌ రంగంలో త్రైమాసిక ఫలితాల ఆధారంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పనితీరును నిర్ణయిస్తారు. ఆ ప్రమాణాల ప్రకారమైతే కార్పొరేట్‌ రంగం మోదీని విఫలుడిగా నిర్ధారిస్తుంది.

ప్రధాని నరేంద్ర మోదీ మన కాలపు ప్రతిభావంతుడైన రాజకీయవేత్త. జనా మోదం పొందే నేతల్లో సుప్రసిద్ధులైనవారి పేర్లు చెప్పడం అంత సులభం కాదు. రష్యాలో పుతిన్, టర్కీలో ఎర్డోగాన్‌ ఈ కోవలోకి వస్తారనిపిస్తుంది. అయితే ఆ దేశాల్లోని రాజకీయాలపై నాకు లోతైన అవగాహన లేదు. కానీ వారికి లభిస్తున్న మద్దతు మోదీకుండే మద్దతుకు దగ్గరగా అనిపిస్తుంది. ఈ ముగ్గురూ వారి వారి పార్టీలకు మించి ప్రజాదరణ ఉన్నవారు. ఆ పార్టీలకున్న సంప్రదాయ పునాదిని మించి ఆ ప్రజాదరణ విస్తరించడమే ఇందుకు కారణం.

ఎప్పుడు సర్వే చేసినా మోదీ రేటింగ్‌ 70 శాతానికి మించి ఉంటుంది. ఆ సర్వేలు అంత ఖచ్చితమైనవి కాదని, అందులో అశాస్త్రీయత పాలు ఎక్కువని నేను గుర్తించాను. అయినప్పటికీ ఆయన నిలకడగా దీన్ని సాధించగలగడం విశేషమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీ జాతీయ స్థాయిలో ఇంతవరకూ గరిష్టంగా సాధించిన ఓట్ల శాతం 31 శాతం మాత్రమే. అది కూడా 2014లో. నేను మాట్లాడినవారిలో చాలామంది ఈ విషయంలో నాతో ఏకీభవించారు.    

మోదీ గురించే తీసుకుంటే ఆయన పట్ల, ఆయన రాజకీయాలపట్ల ఆకర్షితు లవుతున్న వర్గాలవారెవరో గ్రహించగలం. అగ్రకులాలు, మధ్యతరగతి, పట్టణ ప్రాంత ఓటర్లలో ఆయనకున్న పునాది అతి ముఖ్యమైనది. మొన్నటి గుజరాత్‌ ఎన్నికల్లో నగర ప్రాంతాల్లో కనబడ్డ బీజేపీ ప్రభంజనం ఈ విశ్లేషణను ధ్రువీ కరిస్తుంది. గ్రామసీమల్లో, ఓ మాదిరి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విధానాలు విఫలమైనా నగరాల్లోని ఈ పునాదే బీజేపీ వెనకా, వ్యక్తిగతంగా మోదీ వెనకా దృఢంగా నిలబడింది. ఈ మద్దతుకు గల కారణాలు అనేకం.

ఈ దేశం దుర్బలంగా ఉన్నదని, సమూలమైన చర్యల ద్వారా మాత్రమే ఇది సరి అవుతుందని మధ్య తరగతి నమ్ముతోంది. గట్టి నాయకుడు అవసరమనే భావన ఈ వర్గాలను ఎప్పుడూ ఆకర్షిస్తుంది. యాభైయ్యేళ్లవాడిగా మూడు దశాబ్దాలుగా ఇదే జరుగు తోందని నేను చెప్పగలను. ఈ దృక్పథం ఉన్న పరిస్థితిని సూక్ష్మీకరించడం, తగ్గించి చెప్పడం కావొచ్చు.  ఆరెస్సెస్‌ రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి, సంస్కృతికి సంబంధించి దానికున్న బ్రాహ్మణీయ వైఖరి, ఈ వర్గాలు తమ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూసే తీరుకు సరిపోతాయి.

ఈ వర్గాల్లో నిలువెల్లా ఉండే శక్తివంతమైన జాతీయవాదానికి బీజేపీ సరిగ్గా అతుకుతుంది(విదేశాల్లో మోదీ పాల్గొనే సభల్లో కనబడే ప్రవాస భారతీయులంతా ఈ వర్గాలవారే). పాకిస్తాన్, చైనాలకు సంబంధించిన అంశాల్లో వారి మానసిక ధోరణి వేరేగా ఉంటుంది. ఆర్థికంగా ఈ వర్గాలవారు  మంచి జీడీపీ వృద్ధిపైనా, దానివల్ల సమకూరే ఉన్నతోద్యోగాలు, ఆధునిక మౌలిక వసతుల్లో వచ్చే పెట్టుబడులుపైనా (ఉదా:గ్రామీణ ప్రాంత రోడ్ల మెరుగుదలకు బదులు బుల్లెట్‌ రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టానికి బదులు విమానాశ్రయాల విస్త రణపై దృష్టిపెట్టే విధానాలు) ఆధారపడతారు.

మైనారిటీల హక్కుల విషయాన్ని సాధారణీకరించి చెప్పడం సులభం కాదు. దక్షిణాసియా ప్రజల్లో మైనారిటీలపై అయిష్టత ఉండటమన్నది నిజమే కావొచ్చుగానీ ఇక్కడి బీజేపీ అనుకూల దృక్పథం ఉన్నవారికి ఆ మైనారిటీ వర్గాలకు భారత్‌ పట్ల ఉండే వైఖరితో సమస్య ఉంది. లౌకికవాదానికి సంబంధించిన స్వచ్ఛ భావన వీరికి ఎంతమాత్రమూ నచ్చదు. భారతీయుల్లో చాలామంది సెక్యులరిజానికి ఓటేయలేదు. మధ్యతరగతి కనుక వీరిలో చాలామంది నెలవారీ జీతాలపై ఆధారపడతారు. ‘ప్రతిభ’ సమృద్ధిగా ఉండే వీరికి వంశ పారంపర్యతపై ఆధారపడిన రాహుల్‌కన్నా స్వశక్తితో ఎదిగిన మోదీ నచ్చుతారు.

మోదీ మద్దతుదార్లలో ఉండే రెండో కేటగిరి వ్యక్తులు బీజేపీకి కూడా మద్దతుదార్లు. ఎందుకంటే వారు కర్ణాటకలో లింగాయత్‌లు, గుజరాత్‌లో పాటీదార్లు, రాజస్థాన్‌లో రాజ్‌పుట్‌ల వలే ఆధిపత్య కులానికి చెందినవారు. మూడో కేటగిరి వ్యక్తులు హిందుత్వకు ఆకర్షితులయ్యే పౌరులు. శత్రువు అంతర్గ తంగానే ఉన్నాడని, దేశం ప్రగతి సాధించాలంటే ఈ శత్రువును ఏరిపారేయాలని వీరనుకుంటారు. ఈ చివరి రెండు కేటగిరీలూ అంత ముఖ్యమైనవి కాదు. ఎందు కంటే మోదీ ఉన్నా, మరెవరున్నా... ఇప్పుడైనా, ఎప్పుడైనా  వీరు బీజేపీతోనే ఉంటారు. మొదటి కేటగిరి అలా కాదు... వ్యక్తిగతంగా మోదీకి ఉండే సమ్మోహనా శక్తి, ఆయనపై ఉండే నమ్మకం మిగిలిన రెండు కేటగిరిలనుంచి వీరిని వేరు చేస్తుంది.

మనమిప్పుడు 2018లోకి ప్రవేశించబోతున్నాం. ఎన్నికల ముందు సంవ త్సరమిది. ఆర్థికరంగంలో మోదీ పనితీరుకు సంబంధించిన డేటా ఆయన విఫలుడని చెబుతోంది. తన పదేళ్ల పాలనాకాలంలో సాధించిన సగటు వార్షిక వృద్ధి రేటుకు సరితూగగల వృద్ధి రేటును మోదీ ఇంతవరకూ సాధించలేక పోయారని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎత్తిచూపారు. మోదీని అభిమానించే కార్పొరేట్‌ రంగంలో త్రైమాసిక ఫలితాల ఆధారంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పనితీరును నిర్ణయిస్తారు. ఆ ప్రమాణాల ప్రకారమైతే కార్పొరేట్‌ రంగం మోదీని విఫలుడిగా నిర్ధారిస్తుంది. నా వరకూ ముఖ్యమైన అంశమేమంటే... 2009లో విత్త సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయింది. అదిప్పుడు అనూ హ్యంగా 3 శాతం వృద్ధితో పెరుగుతోంది.

ఈ వాతావరణంలో కూడా మన వృద్ధి సంతృప్తికరంగా లేదు. పెద్దనోట్ల రద్దు వంటి దుందుడుకు చర్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటాను. 2019 ఎన్నికల బరిలోకి దిగినప్పుడు మోదీని, బీజేపీని కూడా ఈ వైఫల్యం ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా సాధించిందని చెప్పుకోవ డానికేమీ లేదు(‘త్వరితగతిన ఎదుగుతున్న దేశం’ అనే మాట మీరు విని ఎన్నాళ్ల యింది?). 2014 ఎన్నికలప్పుడున్న ‘అచ్ఛేదిన్‌’లాంటి అనుకూల ప్రచారం ఆ ఎన్నికల్లో ఉంటుందని నేననుకోను. అది గర్హనీయమైన, వేర్పాటువాద ధోరణుల తోనే ఉంటుంది. ఒక భారతీయుడిగా ఇది నన్ను కలవరపెడుతుంది. కానీ వ్యక్తిగ తంగా మోదీకి మద్దతు పలికే మొదటి కేటగిరిలోనివారు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తారనేది ఒక రచయితగా, సామాజిక పరిశీలకుడిగా నాకు ఆసక్తిదాయ కమైనది.


ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఈమెయిల్‌: aakar.patel@icloud.com

>
మరిన్ని వార్తలు