రక్తపోటు పరీక్షలకు మెరుగైన స్మార్ట్‌ఫోన్‌ పద్ధతి!

16 Mar, 2018 08:42 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్లతో చేయగలిగిన పనుల్లో రక్తపోటు పరీక్షలు ఇప్పటికే చేరినప్పటికీ ఇదే పనిని మరింత కచ్చితత్వంతో చేసేందుకు మిషిగన్‌ స్టేట్‌ యూనివర్శిటీకి చెందిన ముక్కామల రామకృష్ణ ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. ఆధునిక త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో, కొన్ని ఆప్టికల్‌ సెన్సర్లను ఉపయోగించి ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌ కేస్‌ను తయారు చేశారు ఈయన. దీంతోపాటు ప్రత్యేకమైన ప్రదేశంలో ఉండే ఇంకో సెన్సర్‌ను వేలితో నొక్కితే చాలు.. రక్తపోటు వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. వేలి ఒత్తిడికి ఆప్టిక్‌ల సెన్సర్లు పనిచేయడం మొదలుపెడతాయని.. రక్తనాళాల్లో రక్తపోటు కారణంగా వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా రక్తపోటు ఎంత ఉందో నిర్ణయించి ఆ సమాచారాన్ని వైర్‌లెస్‌ పద్ధతిలో స్క్రీన్‌ పైకి పంపుతాయని రామకృష్ణ వివరించారు. ఇప్పటికే తాము ఈ స్మార్ట్‌ కేస్‌ను కొంతమందిపై పరీక్షించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ సహకారంతో తయారైన ఈ కొత్త గాడ్జెట్‌ వైద్య రంగంలో మేలి మార్పులకు కారణమవుతుందని వైద్య నిపుణుల అంచనా. 

మరిన్ని వార్తలు