కేడర్ కేటాయింపులు చట్టవిరుద్ధం

30 Mar, 2016 03:46 IST|Sakshi
కేడర్ కేటాయింపులు చట్టవిరుద్ధం

సివిల్ సర్వీస్ అధికారుల పంపిణీపై క్యాట్
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీలకు సివిల్ సర్వీస్ అధికారులను కేటాయించేందుకు నియమించిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ రూపొందించిన నియమ నిబంధనలను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తప్పుబట్టింది. ఆ నిబంధనలు లోపభూయిష్టమని స్పష్టం చేసింది. కేడర్ కేటాయింపులను సవాల్ చేస్తూ పదిహేను మంది అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను క్యాట్ అనుమతించింది. వారి కేటాయింపుల ఉత్తర్వులను కొట్టివేసింది.

ఈ మేరకు క్యాట్ సభ్యులు ఎం.వెంకటేశ్వర్‌రావు, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కుమార్తె, అల్లుడు కేడర్ కేటాయింపుల్లో ఉన్నారని, అలాంటప్పుడు ప్రత్యూష్‌సిన్హా కమిటీలో సభ్యుడిగా మహంతిని నియమించడమేమిటని ప్రశ్నించింది. కేడర్ కేటాయింపుల నిబంధనలన్నీ చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే కేడర్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో క్యాట్‌ను ఆశ్రయించిన వారికే తమ ఆదేశాలను పరిమితం చేస్తున్నామని పేర్కొంది.

కాగా, ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు సోమేష్‌కుమార్, జి.అనంతరాము, ఎస్‌ఎస్ రావత్, ఆమ్రపాలి కాట, రోనాల్డ్‌రాస్, కరుణ వాకాటి, ఎ.వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు సంతోష్‌మెహ్రా, అభిలాష్ బిస్త్, అంజనీకుమార్‌లను తెలంగాణకు కేటాయించాలని క్యాట్ ఆదేశించింది. మరోవైపు తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లు హరికిరణ్, శివశంకర్ లాహోటి, శ్రీజన గమ్మల, ఐపీఎస్ రంగనాథ్‌ను ఏపీకి క్యాట్ కేటాయించింది.

మరిన్ని వార్తలు