బీసీలకు అరచేతిలో వైకుంఠం...

19 Apr, 2017 02:38 IST|Sakshi

కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు అరచేతిలో వైకుంఠం చూపి ఓట్లు దండుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. మంగళవారం బంజారా ఫంక్షన్‌ హాలులో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ‘యాదవ, కురుమ, గొల్ల’ల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలను మోసం చేసే చర్యలను తిప్పికొట్టేందుకు, హక్కుల పరిరక్షణకు గ్రామగ్రామాన ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చైతన్య సదస్సులను నిర్వ హించాలని పిలుపునిచ్చారు.

బీసీల మద్దతు కోసం తాయిలాలు ప్రకటిస్తున్నారే తప్ప సంక్షేమ పథకాల అమల్లో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. సీఎం మాటలకు బడుగు, బలహీన వర్గాలు మోసపోయే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోనూ బీసీలు బీజేపీ వైపు చూస్తున్నారని, తమ పార్టీకి మద్దతునిస్తున్నారని చెప్పారు. మరోవైపు మోదీ ప్రభుత్వం బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాను కల్పించడంపై ధన్యవాదాలు తెలుపుతూ ఈ సదస్సు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాటం నర్సింహ యాదవ్, ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు