కేసీఆర్ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

9 May, 2016 01:09 IST|Sakshi
కేసీఆర్ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

అబిడ్స్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.  గోషామహల్ నియోజకవర్గంలోని చుడీబజార్ ప్రాంతంలో ఆదివారం నూతనంగా నిర్మించే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను హోంమంత్రితోపాటు  మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... పేద, బడుగు వర్గాల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కూడా పోలీస్‌శాఖ చేస్తున్న కృషి అమోఘమన్నారు.  మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, ఇతర పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు,కార్పొరేటర్‌లు ముఖేష్‌సింగ్, జి. శంకర్‌యాదవ్, పరమేశ్వరిసింగ్, టీఆర్‌ఎస్ గోషామహల్ ఇన్‌చార్జ్ ప్రేమ్‌కుమార్‌ధూత్, రాష్ట్ర నాయకులు నందకిషోర్‌వ్యాస్, సురేష్‌ముదిరాజ్, వినోద్‌యాదవ్, బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌సింగ్, లాల్‌సింగ్, కమల్‌సింగ్, రాజుసింగ్, ఆనంద్‌సింగ్, ఆర్‌వీ మహేందర్ కుమార్, ఆర్. శంకర్‌లాల్ యాదవ్, బెజిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు