భార్య ఫిర్యాదు చేసిందని.. భర్త అఘాయిత్యం!

19 Jun, 2016 22:33 IST|Sakshi
భార్య ఫిర్యాదు చేసిందని.. భర్త అఘాయిత్యం!

నాగోలు: ఇంట్లో గొడవలపై భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఎల్‌బీనగర్ పీఎస్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం చోలెరామారానికి చెందిన కృష్ణ,  వాణిలకు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరు నగరానికి వచ్చి ఎల్‌బీనగర్ కాకతీయకాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

దీంతో వాణి మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం మోత్కూరు, సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆదివారం సరూర్‌నగర్ స్టేషన్‌లో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఉంది. పోలీసులు కృష్ణకు ఫోన్ చేసి కౌన్సెలింగ్‌కు తల్లిని వెంట తీసుకురావాలని చెప్పారు. నగరానికి వచ్చిన కృష్ణ తల్లి బంధువుల ఇంట్లో ఉంది. బంధువులు ఉదయం 6 నుంచి కృష్ణ కు ఫోన్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి కిటికిలో నుంచి చూడగా ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.

దీంతో ఎల్‌బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. తన మృతికి భార్య, అత్త, మామ, నలుగురు బావమరుదులు, ఇంటి యజమాని కారణమని అందులో పేర్కొన్నాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు