కాంట్రాక్టర్లకు కామధేనువులు!

7 Mar, 2016 00:19 IST|Sakshi
కాంట్రాక్టర్లకు కామధేనువులు!

నగరంలో తరుచుగా కాలిపోతున్నడిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు
నిర్వహణ లోపమే కారణం
కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న వైనం...
ఆయిల్ లీకేజీలను అరికట్టడంలో ఘోరంగా విఫలం
డిస్కం ఆదాయంలో చాలా వరకు రిపేర్లకే కేటాయింపు
 

సిటీబ్యూరో: ఆయిల్ లీకేజీ.. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుక పోయిన చెత్త...ఓవర్‌లోడు...లూజ్ కాంటాక్ట్స్...లైన్ల మధ్య నుంచి చెట్ల కొమ్మలు పెరగడం, వంటి అంశాలు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల పాలిట శాపంగా మారుతున్నాయి. అమర్చిన కొద్దికాలానికే కాలిపోయి షెడ్డుకు చేరుతున్నాయి. కాంట్రాక్టర్ల పాలిట ఇవి కామధేనువులా మారుతున్నాయి. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పునరుద్ధరణ పేరుతో ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నా..నష్టాలు మాత్రం తగ్గడం లేదు.

నిర్వహణ లోపం...విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు తరుచుగా కాలిపోతున్నాయి. తద్వారా ఏటా డిస్కంకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుండగా...కాంట్రాక్టర్లకు మాత్రం కాసులు కురుస్తున్నాయి.  రిపేరు చేసిన కొద్దిరోజులకే మళ్లీ అవి పాడైపోతుండటంతో చేసిన దానికే మళ్లీ మళ్లీ  రిపేర్లు చేస్తూ భారీగా దండుకుంటున్నారు. ఈ పనులను స్వయంగా పరిశీలించాల్సిన అధికారులు కూడా పరోక్షంగా వీరికి సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2015-16 లో ఒక్క రంగారెడ్డి సౌత్ సర్కిల్‌లోనే 2112 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా, రిపేర్ల కోసం 2.27 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క ఏడాదిలోనే రూ.8 కోట్లకు పైగా కేవలం ట్రాన్స్‌ఫార్మర్ల రిపేరుకే ఖర్చు చేయడం గమనార్హం. ఐదేళ్లలో కేవలం నాలుగు డివిజన్లలో 22,720 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయంటే..వీటి నిర్వహణ తీరు ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పునరుద్ధరణ కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు మెరుగుపడక పోగా తరచూ కాలిపోతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరమ్మతులు చేపట్టినా..తగ్గని నష్టాలు..
ఆయిల్ లీకేజీలను అరికట్టకపోవడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ చెత్త పేరుకపోవడంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి అవి కాలిపోతున ా్నయి. కోఠి నుంచి కాచిగూడ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే దారిలో ఇటీవలో ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఇదే కారణంతో కాలిపోయింది. ఫలితంగా ఆ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని కాలనీలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏదైన ఒక ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం తలెత్తి కాలిపోతే దాని స్థానంలో మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలి. అయితే అధికారులు మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్‌లతో కాలం వెల్లదీస్తున్నారు. రిపేరుకు వచ్చిన వాటిలో చాలా వాటికి కనీసం ఆయిల్ కూడా మార్చకపోవడంతో పాటు లోపభూయిష్టమైన వైండింగ్ వల్లే కేవలం ఆరుమాసాల వ్యవధిలోనే రెండుసార్లు కాలిపోతున్నట్లు వివర్శలు లేకపోలేదు. వీటిని అరికట్టాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
 
కేటాయింపులోనూ అవినీతి
విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులను నివారించేందుకు ఏటా కొత్తగా వేలాది ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మ ర్ల కేటాయింపులోనూ అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు స్వయంగా డిస్కం పెద్దలే అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు కేటాయించిన వాటి పని తీరు, కంపెనీ ఇచ్చిన గ్యారంటీ గడువు వంటి అంశాలు పరిశీలించకుండానే కొత్తవి కేటాయిస్తున్నారు.ప్రజావసరాల కోసం ఉపయోగించాల్సిన ఈ ట్రాన్స్‌ఫార్మర్లను స్థానిక అధికారులు ప్రైవేటు వాణిజ్య సముదాయాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తవాటి కేటాయింపులోనే కాదు కాలిపోయినని రిపేర్లకు కేటాయించడంలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ఐదు రిపేరింగ్ షెడ్డులు ఉన్నా.. వీటిని కాదని మహేశ్వరం సమీపంలో ఉన్న షెడ్డుకే ఎక్కువగా కేటాయిస్తుండటం కొసమెరుపు.

మరిన్ని వార్తలు