‘చిట్టీలరాణి’ దొరికేనా..!

9 Apr, 2014 11:10 IST|Sakshi
‘చిట్టీలరాణి’ దొరికేనా..!

హైదరాబాద్ : టీవీ ఆర్టిస్టులకు రూ.10 కోట్లకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి నెల కావొస్తున్నా నేటికీ ఆచూకీ దొరకలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ డీసీపీ పాలరాజు ఆమెతో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసు నమోదు చేశారు. విజయరాణిని అరెస్టు చేయాలని బాధితులు వరుసగా ఆందోళనలు చేయడంతో నిందితురాలికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు.
 
అయితే నేటి వరకు అసలు నిందితురాలి ఆచూకీ తెలియరాలేదు. ఇంటి సామానులతో సహా ఆమె బెంగుళూరుకు పారిపోయి ఉంటుందని కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన క్లూ ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వచ్చింది. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు.

రెండేళ్ల నుంచే పక్కా పథకం వేసుకున్న విజయరాణి చిట్టీల పేరుతోనే కాకుండా తెలిసివారందరి దగ్గర అధిక వడ్డీ పేరుతో కోట్లాది రూపాయలు అప్పు చేసింది. అంతేకాకుండా తన కుమారుడు సినిమాలో హీరో అవుతున్నాడని నమ్మించి బంధువులు వద్ద నుంచి బంగారు ఆభరణాలను సైతం తీసుకుంది.
 
ఆ తరువాత తన పేరుపై ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఇంటి సామానుతో పారిపోయింది. ఇంతవరకు ఆమె, మిగిలిన నిందితుల ఆచూకీ లభించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపినా ఇంత వరకు ఆచూకీ లభించలేదని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీసీఎస్ అధికారులు అంటున్నారు.
 

>
మరిన్ని వార్తలు