టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పండి: బీజేపీ

22 Feb, 2016 03:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అరాచకపాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అసత్య ప్రచారాలతో ముందుకొస్తున్న ఆ పార్టీ నిజస్వరూపాన్ని గమనించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి భవిష్యత్‌లో కేంద్రం నుంచి అత్యధిక నిధులు వచ్చేలా చూడాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం పెద్దమొత్తంలో నిధులిచ్చిందని, రోడ్ల కోసం రూ.43 వేల కోట్లు, 81వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసిందని, వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని గుర్తుచేశారు. కాగా, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఖమ్మం పరిశీలకుడిగా ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, అచ్చంపేట నగర పంచాయతీ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ రామచంద్రరావులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు.

మరిన్ని వార్తలు