షాకింగ్‌: 'అణు' పేలుడు.. 200 మంది మృతి!

31 Oct, 2017 17:56 IST|Sakshi

ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. హైడ్రోజన్‌ బాంబు పరీక్ష సందర్భంగా సమీపంలోని ఓ సొరంగం కుప్పకూలి.. 200 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతమైన పంగ్యే-రీ ప్రాంతంలో గత నెల కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సర్కారు హైడ్రోజన్‌ అణుబాంబు పరీక్షించింది. కొరియా చేపట్టిన ఆరో అణ్వాయుధ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్‌ 3న దాదాపు వందకిలోల హైడ్రోజన్‌ బాంబ్‌ను పేల్చింది. అత్యంత శక్తిమంతమైన ఈ పేలుడు ధాటికి ఆ దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. పేలుడు ధాటికి పరీక్ష జరిగిన ప్రాంతమంతా తీవ్ర ప్రభావానికి లోనై.. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కుప్పకూలిందని జపాన్‌కు చెందిన ఆసహి టీవీ చానెల్‌ తెలిపింది.

ఈ ప్రమాదంలో సొరంగం నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వందమంది కార్మికులు చనిపోయారని మొదట భావించారని, కానీ, సహాయక చర్యలు ముగిసిన తర్వాత మృతుల సంఖ్య 200కు చేరుకుందని తేలిందని కొరియా వర్గాలను ఉటంకిస్తూ ఆ చానెల్‌ వెల్లడించింది. 1945లో హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కంటే ఏడురెట్లు పెద్దదైన ఈ హైడ్రోజన్‌ బాంబు పరీక్ష వల్ల అక్కడి భూభాగం మెత్తబడి ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారని ఆ చానెల్‌ పేర్కొంది. అత్యంత శక్తివంతమైన ఈ హైడ్రోజన్‌ బాంబు పేలుడుతో ఆ ప్రాంతంలోని పర్వతం అడుగుభాగంలో 60 నుంచి 100 మీటర్ల అగ్నిగుండం ఏర్పడిందని కొరియా వాతావరణశాఖ ఇప్పటికే వెల్లడించింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మరిన్ని అణుబాంబు పరీక్షలు నిర్వహిస్తే..  వాతావరణంలోకి రేడియోధార్మిక కణాలు లీక్‌ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు