రాష్ట్రపతి విశాఖ పర్యటన ఖరారు

31 Oct, 2017 18:18 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విశాఖ పర్యటన ఖరారైంది. తూర్పు నౌకాదళ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన నగరానికి రానున్నారు. డిసెంబర్‌ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా నేవల్‌ బేస్‌కు చేరుకుని సాయంత్రం బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. అక్కడ కాసేపు నేవీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన ముచ్చటిస్తారు.

అనంతరం ఏయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం నేవల్‌ బేస్‌కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే స్వర్ణోత్సవాల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొననున్నారు. పరేడ్‌లో రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆపై మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి బయల్దేరతారని అధికారిక వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు