బోయింగ్‌ 737 విమానాలను రద్దు చేసిన సింగపూర్‌

12 Mar, 2019 12:54 IST|Sakshi

సింగపూర్‌ : ఆదివారం జరిగిన ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో సింగపూర్‌ తన విమానయాన సంస్థల వద్ద వున్న బోయింగ్‌ 737 విమానాలను పక్కనపెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తాత్కలికమే అని అధికారులు తెలిపారు. ఇథియోపియా దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 'బోయింగ్‌ 737 మ్యాక్స్‌ - 8' విమానం బయలుదేరిన కాసేపటికే కుప్పకూలి 157 మంది మరణించడంతో సింగపూర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

చైనా, ఇండొనేషియా కూడా సింగపూర్‌ బాటలోనే నడుస్తున్నాయి. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో చైనా, ఇండోనేషియా దేశ విమానయాన సంస్థలు కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమాన సర్వీసులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. విమానాల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా పేర్కొంది. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్‌ ఎయిర్‌ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ప్రమాదానికి గురైన బోయింగ్‌ విమానం కూడా బయలుదేరిన కొన్ని నిమిషాలకే ప్రమాదానికి గురవడంతో వీటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు