ఇస్లాం మతంపై చైనా యుద్ధం

22 May, 2018 10:00 IST|Sakshi
చైనాకు చెందిన ముస్లిం మైనార్టీలు యుగర్లు ప్రార్థనలు చేస్తున్న దృశ్యం

బీజింగ్‌, చైనా : కమ్యూనిస్టు రాజ్యమైన చైనాలో క్త్రైస్తవంతో పాటు పలు మతాలు ఉన్నాయి. అయితే, అక్కడ ఇస్లాం మతం పడుతున్న బాధలు మరే ఇతర మతం పడటం లేదనే మాట వాస్తవం. చైనాలో నివసిస్తున్న 20 లక్షల మంది ముస్లిం జనాభాలో దాదాపు 11 లక్షల మంది గ్జిన్‌జియాంగ్‌లో ఉంటున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని చైనా ప్రభుత్వం గ్జిన్‌జియాంగ్‌ యుగర్‌ అటానమస్‌ రీజియన్‌గా ప్రకటించింది.

అక్కడ ‘అటానమస్‌’ అన్నపదం పేరుకే తప్ప అక్కడి ప్రజలకు నిజమైన స్వతంత్ర లేదు. వేలాది మంది ఉగర్‌ ముస్లింలను చైనా ప్రభుత్వం అనధికారికంగా బంధించింది. గ్జిన్‌జియాంగ్‌లా ఇతర ప్రాంతాల్లో ముస్లింల జనాభా పెరగకూడదనే ఉద్దేశంతో రంజాన్‌ మాసం ప్రారంభమైన తొలి వారంలో ఆంక్షలు విధించింది. మసీదులపై కచ్చితంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన చైనా ఇస్లామిక్‌ అసోసియేషన్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నింగ్సియా, బీజింగ్‌, గాన్సూ, క్వింఘై, గ్జిన్‌జియాంగ్‌ అనే ఐదు ప్రాంతాల్లోనే మత ప్రచారాలు నిర్వహించాలని పేర్కొంది. రంజాన్‌ నెల గత వారం ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇస్లాం మత వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా ఈ చర్యలకు ఉపక్రమించదనే వాదనలు వినిపిస్తున్నాయి. మసీదుపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా ముస్లింలు వంటి మతాల ప్రజల్లో దేశ భక్తి పెరుగుతుందని తన ప్రకటనలో ఇస్లామిక్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు