ఇండియన్స్ విజిటింగ్‌ వీసాలపై రావద్దు!

3 Aug, 2017 21:39 IST|Sakshi
ఇండియన్స్ విజిటింగ్‌ వీసాలపై రావద్దు!

దుబాయి(యూఏఈ): ఉపాధి కోసం యూఏఈ రావాలనుకునే వారు విజిటింగ్‌ వీసాలపై మాత్రం ఇక్కడికి రావద్దని యూఏఈ ప్రభుత్వం భారతీయులను కోరింది. వీసా మోసాలు, నకిలీ ధ్రువపత్రాలు పెద్ద సంఖ్యలో బయటపడుతున్న నేపథ్యంలో యూఏఈ ఈ మేరకు సూచనలు వెలువరించిందని దుబాయిలోని భారతీయ రాయబార కార్యాలయం వివరించింది. ప్రతిరోజు ఇందుకు సంబంధించి వందలాదిగా బాధితుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని తెలిపింది.

ఇలా మోసపోయి విజిటింగ్‌ వీసాలపై 2016లో యూఏఈకి వచ్చిన 225 మంది భారతీయులను, 2017లో ఇప్పటివరకు 186 మందికి టికెట్లు కొనుగోలు చేసి ఇచ్చి ప్రభుత్వం వెనక్కి పంపిందని పేర్కొంది. నకిలీ వీసాలను భారతదేశంలో గుర్తించటం చాల కష్టమని భారత రాయబార కార్యాలయం వివరించింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి కోసం వచ్చే భారతీయులు నమ్మకమైన వారి ద్వారా కచ్చితమైన ఉద్యోగ వీసా పత్రాలను, ధ్రువీకరణలను పొందాలని లేని పక్షంలో కష్టాలు తప్పవని హెచ్చరించింది.
 

మరిన్ని వార్తలు