భగ్గుమన్న అగ్రరాజ్యం: వైట్‌హౌస్‌ వద్ద ఉద్రిక్తత

1 Jun, 2020 14:40 IST|Sakshi

వాషింగ్టన్‌ : నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో రాజుకున్న నిరసన జ్వాలలు అధ్యక్ష భవనాన్ని బలంగా తాకాయి. ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ అనే నినాదం అగ్రరాజ్య వీధుల్లో మారుమోగుతోంది. ఈ క్రమంలో వేలాదిమంది ఆందోళనకారులు ఆదివారం రాత్రి వైట్‌హౌస్‌ వద్దకు తరలివచ్చారు. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు. భారీగా ఉన్న బందోబస్తును చీల్చుకుంటూ అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంలో ముందస్తు జాగ్రత్తగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను సీక్రెట్‌ ఏజెన్సీ రహస్య బంకర్‌లోకి పంపింది. సుమారు గంటపాటు ట్రంప్‌ అదే బంకర్‌లో తలదాచుకున్నారు. అధ్యక్ష భవనం ముందు పరిస్థితి అదుపు తప్పడంలో నేషనల్‌ గార్డ్‌ బలగాలను రంగంలోకి దించారు. దీంతో ఆందోళకారులు, పోలీసులు మధ్య ఘర్షణ యుద్ధరంగాన్ని తలపించింది. 

ఈ క్రమంలో పదుల సంఖ్యలో నిరసకారులు తీవ్ర గాయాల పాలైయ్యారు. కాగా మినియాపొలిస్‌ పోలీస్‌ కస్టడీలో ప్రాణాలో కోల్పోయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతిని నిరశిస్తూ నూయార్క్‌ నుంచి లాక్‌ఎంజెల్స్‌ వరకు మొత్తం 45 నగరాల్లో ఆందోళనలు తీవ్ర రూపందాల్చాయి. అయితే నిరసల్లో పాల్గొన్న వారిని ట్రంప్‌ దుండగులుగా అభివర్ణిస్తూ ట్రంప​ చేసిన ట్వీట్‌ అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ట్రంప్‌ ట్వీట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు  ఉద్యమిస్తున్నారు. దీంతో దేశ ‍వ్యాప్తంగా అనేక నగరాల్లో కర్ఫ్యూని విధించారు. ఇక జార్జ్‌ మృతితో చెలరేగిన వివాదం అమెరిరాను అతలాకుతలం చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆ​స్తులు ధ్వంసం చేయబడ్డాయి.

మరిన్ని వార్తలు