భారత్, అమెరికా ఎన్నికలపై దృష్టి

6 Apr, 2018 02:46 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్, పాకిస్తాన్, అమెరికా సహా పలుదేశాల్లో ఈ ఏడాది జరగనున్న ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఎన్నికలు జరగనున్న ఈ దేశాల్లో ఫేస్‌బుక్‌ కేంద్రంగా నకిలీ వార్తలు, వదంతులు వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందులో భా గంగా కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌(ఏఐ) టూల్స్‌తో పాటు 15,000 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌తో పాటు హంగేరీ, బ్రెజిల్, మెక్సికోల్లో జరగనున్న ఎన్నికల సమగ్రతను కాపాడటానికి ఫేస్‌బుక్‌ కృషి చేస్తుందన్నారు.

ఈ ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కోట్లాది మంది ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్‌ అనలిటికా దొంగలించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జుకర్‌బర్గ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు.  2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం రష్యాకు చెందిన ఇంటర్నెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ తప్పుడు వార్తల్ని వ్యాప్తిచేయడం గుర్తించామన్నారు. ఐఆర్‌ఏకు సంబంధించిన అన్ని పేజీలను తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదేఏడాది జరిగిన ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఏఐ టూల్స్‌తో 30వేల నకిలీ ఖాతాల్ని నిలిపేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు